పత్రిక పెట్టేది లేదు, జగన్ పత్రిక ప్లాప్ అంటోంది: బాబు
ఆ పత్రికకు విలువలు ఏమాత్రం లేవన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, తాను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేశామని, మేం తలచుకుంటే పేపర్ పెట్టలేమా? అని ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా పత్రిక పెట్టనని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కిరాణా కొట్టు తెరిచి ఉద్యోగాలిస్తూ డబ్బులు కొట్టేస్తున్నాడని చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్లో ఒక సోదరుడిని, చిత్తూరులో మరో సోదరుడిని పెట్టి అందినకాడికి దోచేస్తున్నాడని ఆరోపించారు. సమాచార కమిషనర్లుగా ఆదర్శవంతులైన వ్యక్తులను నియమించాల్సిందిపోయి తన మనుషులను నియమించుకొన్నాడని.. ఇంత తప్పుడు, పనికిమాలిన ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ లోటస్పాండ్లో 72 గదుల్లో ప్యాలెస్ నిర్మించాడని, అందులో దయ్యాలు కాపురాలు చేస్తాయి తప్ప మనుషులు కాదన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఆయన కుమారుడు జగన్, అల్లుడు బ్రదర్ అనిల్పై అవినీతి ఆరోపణలతో చంద్రబాబు విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులను మూసేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. అవినీతి విషయంలో ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, మన సంపద, కష్టాన్ని దోచుకొన్న వారిపై రాజీలేని పోరాటం చేయాలనిచంద్రబాబు పిలుపునిచ్చారు.