అప్పుడు చేశాం, అవసరమైతే ఇప్పుడూ చేస్తాం: సచిన్
రైతుల కోసం కేంద్రం అవసరమైతే మరోసారి రుణ మాఫీకి సిద్ధంగా ఉందని చెప్పారు. సచిన్ వ్యాఖ్యల ద్వారా ముందస్తు ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2009 ఎన్నికలకు ముందు తీసుకున్న కీలక నిర్ణయాన్ని 2014 ఎన్నికల ముందు కూడా పునరావృతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి రాజేష్ పైలట్ 68వ జయంతి సందర్భంగా గుర్గావ్లో ఆదివారం కిసాన్ సమ్మేళన్ నిర్వహించారు. ఈ సభలో కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సచిన్ పైలట్ మాట్లాడారు.
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని, గత ఎనిమిదేళ్లుగా యూపిఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ, రైతు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. తామెప్పుడూ రైతుల పక్షానే నిలిచామని, వారెంత కీలకమో తమకు తెలుసునని అందుకే, గత యూపిఏ ప్రభుత్వం రూ.70 వేల కోట్ల రుణ మాఫీ పథకాన్ని అమలు చేసిందన్నారు. దాంతో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులకు మేలు జరిగిందన్నారు.
ఇటువంటి మరో పథకాన్ని ప్రకటించేందుకు తమ ప్రభుత్వం వెనకాడడం లేదన్నారు. అవసరమైతే, మరో రుణ మాఫీ పథకాన్ని ప్రకటించేందుకూ అభ్యంతరం లేదన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు అంటే, 2008 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం రుణ మాఫీ పథకాన్ని ప్రకటించింది. అప్పుడూ, ఇప్పుడూ ఆర్థిక మంత్రి చిదంబరమే. అప్పట్లో ఆయనే ఈ పథకాన్ని ప్రకటించారు. చిన్న, మధ్య తరగతి రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నామన్నారు.