జగన్ పార్టీ నేతను తోసేసిన హర్షకుమార్, ఘర్షణ
హర్షకుమార్తో పాటు ఆయన కుమారుడు, అనుచరులు కలిసి రాజబాబుపై దాడికి దిగారని వైయస్సార్ కాంగ్రెసు వర్గాలు ఆరోపిస్తున్నాయి. కెజి బేసిన్ పరిధిలో రిలయన్స్, జిఎన్పిసి వంటి చమురు సంస్థల వ్యవహారంపై హర్ష కుమార్ మన గ్యాస్ మన హక్కు పేరిట అమలాపురంలో క్షత్రియ కళ్యాణ మంటపంలో సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ సదస్సుకు శాసనసభ్యులు బండారు సత్యానంద రావు, తోట త్రిమూర్తులు, పాముల రాజేశ్వరీదేవి, ఎమ్మెల్సీలు కెవి సత్యనారాయణరాజు, రుద్రరాజు పద్మరాజు తదితరులు హాజరయ్యారు. సదస్సుకు హాజరైన రాజబాబు వేదికపై హర్షకుమార్ను నిలదీశారు. తొమ్మిదేళ్లు పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఏం చేశారని, ఇన్నాళ్లు ఈ ఉద్యమం ఎందుకు చేయలేదని అడిగారు.
రాజబాబు ప్రశ్నలతో కాంగ్రెసు వర్గాలు ఆగ్రహం చెందాయి. సభా వేదికపై నుంచి రాజబాబును కిందికి తోసేశారు. ఈ దాడిలో రాజబాబు చొక్కా చినిగిపోయింది. ముఖం, ఛాతీలపై గాయాలయ్యాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎంపి హర్షకుమార్, ఆయన తనయుడు సుందరరాజ్, తదితరులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.