మరో ఎస్సై!: ప్రేమించి మోసంచేశాడని యువతి ఫిర్యాదు
కూకట్పల్లి ఎస్సై ప్రదీప్ బాబు తనను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన ఫిర్యాదు తమ దృష్టికి వచ్చిందని.. విచారణ జరిపించి తప్పకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తిరుమల రావు చెప్పారు. కాగా, ప్రస్తుతం ఎస్సై ప్రదీప్ బాబు సెలవులో ఉన్నారు. రెండు రోజుల క్రితం దుండిగల్ ఎస్సై సుధీర్ ఓ మహిళను వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎస్సై సుధీర్ను సిపి సస్పెండ్ చేశారు.
తనను ఎస్సై వేధిస్తున్నాడని, ఆయన వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసిన ఓ మహిళా టీచర్ రెండు రోజులుగా కనిపించడం లేదు. దుండిగల్ ఎస్సైగా పని చేస్తున్న సుధీర్ అడ్డగుట్టలో నివసిస్తున్నాడు. సుధీర్ ఇంటి ఎదురుగా లీల కుటుంబం ఉంటుంది. లీలా ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఎస్సై గత కొన్నాళ్లుగా లీలను వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని లీల తన భర్తకు తెలియచెప్పింది.
వేధించవద్దని ఎస్సైతో చెప్పినప్పటికీ ఆపలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల వేధింపులు మరింత ఎక్కువయ్యాయని వారు అన్నారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని లేదంటే చంపేస్తానని లీలను బెదిరించాడు. దీంతో ఎస్సై వేధింపులు తట్టుకోలేక రెండు రోజుల క్రితం లీల తాను చనిపోతానంటూ లేఖ రాసి అదృశ్యమైంది. ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు సీరియస్గా తీసుకొని సుధీర్ను సస్పెండ్ చేశారు.