వైయస్ స్కీమ్స్ తికమకలో బాబు, చిరంజీవి దారే: రోజా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో చిరంజీవి కావడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి రోజా ఆదివారం అన్నారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వస్తున్నా మీకోసం పేరుతో బాబు చేస్తోంది పాదయాత్ర కాదని పనిష్మెంట్ యాత్ర అన్నారు. ఓ మహిళ అయిన షర్మిల ప్రజల కోసం నడుస్తుంటే అభినందించాల్సింది పోయి అభాండాలు వేయడం సరికాదన్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు రాకుండా చంద్రబాబు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. షర్మిలను బద్నాం చేసేందుకే ఆమె భర్త, క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ పైన బురద జల్లుతున్నారని రోజా అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్క్రిప్టును భారతీయ జనతా పార్టీ తన కార్యాలయంలో చదువుతోందని ఆరోపించారు. బాబు తన పార్టీని కాంగ్రెసులో కలిపేసి మరో చిరు అవుతారని జోస్యం చెప్పారు.
చంద్రబాబు.. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో పెట్టుకొని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాము వైయస్ పాలన తెస్తామంటే చంద్రబాబు తన పాలన తెస్తానని చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఎన్టీఆర్ పేరు చెబుతున్న బాబు వైయస్ పథకాలతో ముందుకు వెళ్తున్నారన్నారు. తన పాలన గురించి బాబు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
బాబు ఇప్పుడు అమలు చేస్తానని హామీ ఇస్తున్న పథకాలను వైయస్ ఎప్పుడో చేపట్టారన్నారు. వైయస్ పాలన బాగాలేదంటూనే ఆయన పథకాలను తెస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ తన హయాంలో పేదలకు బియ్యం రూపాయికి కిలో ఇస్తే బాబు దానిని ఐదున్నర చేశారని, అదే వైయస్ రెండు రూపాయలకు ఇచ్చారని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ వైయస్ ఎప్పుడో ఇచ్చారని కొత్తగా బాబు ఆ పథకాన్ని పట్టుకున్నారన్నారు.
వైయస్ పథకాలకు తూట్లు పొడిచిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా జగన్ను బాబు విమర్శించడమేమిటన్నారు. కాంగ్రెసుతో బాబు కుమ్మక్కు రాజకీయాలు నెరపుతున్నాడని ఆరోపించారు. బయట తిడుతూ వెనుక కిరణ్కు మద్దతిస్తున్నారన్నారు. తమ అధినేత జగన్ను గజదొంగ అంటావా? అని తీవ్రంగా ప్రశ్నించారు. బాబు తన తొమ్మిదేళ్ల పాలనలో అవినీతికి పాల్పడ్డారన్నారు.
కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నందు వల్లే బాబుపై ఎలాంటి కేసులు లేవన్నారు. రాబోయే కాలంలో కాబోయే సిఎం జగన్ అనే భయంతోనే కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కై తమ పార్టీని మొగ్గలోనే తుంచేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ఫోటోతో వైయస్ పథకాలు వల్లిస్తున్న బాబు తానే తప్పులు ఒప్పుకుంటూ ప్రజలు మారాలనడం విచిత్రంగా ఉందన్నారు. కన్ఫ్యూజన్లో ఉన్న చంద్రబాబు ప్రజలను కన్ఫ్యూజన్కు గురి చేసి అధికారం చేపట్టాలనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
కుమ్మక్కు రాజకీయాలు: కొండా సురేఖ
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సహకార ఎన్నికల్లో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖ వరంగల్లో అన్నారు. తమ పార్టీ అధినేత జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఇంద్రకరణ్ రెడ్డి వేరుగా అన్నారు.