జయశంకర్ సూసైడ్ చేసుకునేవారు: కెసిఆర్పై సిపిఐ
తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో తెరాసను విలీనం చేస్తానని కెసిఆర్ ప్రకటించడం తప్పన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణపై తేలిక భావం ఏర్పడడానికి కారణం కెసిఆరేనన్నారు. గుంభనంగా గట్టిగా పోరాడితే కేంద్రం దిగి వచ్చేదని, కెసిఆర్ నిలకడగా లేకపోవడం.. కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లడం.. వారిని కలుసుకుంటున్నానని చెప్పి పార్టీని కలుపుతానని చెప్పడం.. ఒక పార్టీని మరో పార్టీకి దగ్గర చేస్తాననడం అవమానకరమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ అంశం ఆ రెండు పార్టీల సొత్తు కాదని, ప్రత్యేక రాష్ట్రం కోరే కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు తెరాస, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిలోను ఉన్నట్లు గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మీలో కలిసిపోతానని కెసిఆర్ అనడం 'క్విడ్ ప్రో కో' అవుతుందన్నారు. తెలంగాణ కోసం గట్టిగా పోరాడితే కేంద్రం పట్టించుకునేదన్నారు. వారికి భయం లేకుండా మన లోపాలే ఉన్నాయన్నారు.
2014 ఎన్నికల్లో తడాఖా చూపుతామని కెసిఆర్ అంటున్నారని, తెలంగాణకు ఓట్లు, సీట్లతో ముడిపెట్ట వద్దని హితవు పలికారు. తెలంగాణపై ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏం చెబితే అది ఆమోదిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు భ్రమలు కల్పిస్తున్నారన్నారు. తెలంగాణ అంశం సోనియా, మన్మోహన్, రాహుల్ చుట్టూనే తిరుగుతున్నదని, కాంగ్రెసు అందర్నీ మోసం చేస్తోందన్నారు.