కెసిఆర్పై మరోసారి నాగం జనార్దన్ రెడ్డి చిందులు
తెలంగాణ విద్యార్థులపై వరదా రెడ్డి దాడి చేయించారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ఆయన కెసిఆర్ను ప్రశ్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఒయు)లో తనపై దాడి చేసిన విద్యార్థులపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై దాడి చేసిన విద్యార్థులపై కేసులు పెట్టవద్దని ఆ రోజే చెప్పానని, అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు ఆ విషయం చెప్పానని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిన నాగం జనార్దన్ రెడ్డిపై కొంత మంది విద్యార్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆయన కింద పడిపోయారు. తెలంగాణ వ్యతిరేకి అయిన నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో ఉండి, తమ వద్దకు వస్తే సహించబోమని విద్యార్థులు చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణకు రెఫరెండం అని అనడం తెరాసకు తగదని ఆయన అన్నారు. ఉద్యమంలో నియంతృత్వ పోకడలకు తావు లేదని అన్నారు. గత కొద్ది కాలంగా కెసిఆర్ తీరుపై, తెరాస వైఖరిపై నాగం జనార్దన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.తెలంగాణ జెఎసిలో తనకు సభ్యత్వం ఇవ్వకుండా తెరాస అడ్డుకుంటోందని నాగం జనార్దన్ రెడ్డి ఇటీవల విమర్శించారు. తెలంగాణ కోసం అందరూ ఒకే వేదిక మీదికి రావాలని కూడా ఆయన కోరారు.