ఎపి భవన్ వద్ద సూట్కేసు కలకలం: పార్లమెంట్ వద్దా
బాంబు స్వ్కాడ్తో ఢిల్లీ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సూటుకేసు కలకలం రేపడంతో భయాందోళలో ఉన్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ ఆ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. హైదరాబాదులోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో జంట పేలుళ్ల తర్వాత కేంద్రం దేశంలోని ముఖ్య నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇలాంటి సమయంలో ఎపి భవన్ సమీపంలో సూటుకేసు కలకలం చెలరేగింది. పార్లమెంటు భవనం సమీపంలోను మరోసూటు కేసు లభ్యమైంది. కాగా, సూటుకేసులను తనిఖీ చేసిన బాంబు స్క్వాడ్ దానిని ఆకతాయిల పనిగా నిర్దారించింది. సూటుకేసులో దుస్తులు ఉన్నట్లుగా వారు గుర్తించారు.
పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి దాడుల ప్రమాదం ఉందని, పేలుళ్లు జరగవచ్చునని నిన్న ఉదయమే హైదరాబాదు పోలీసులను తాము అప్రమత్తం చేశామని కేంద్ర హోంశాఖ శుక్రవారం మధ్యాహ్నం తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూరు, హుబ్లీలలో కూడా పోలీసులను హెచ్చరించినట్లు హోంశాఖ ప్రకటించింది.
విజయవాడలో టిఫిన్ బాక్స్ కలకలం
హైదరాబాదు జంట పేలుళ్ల నేపథ్యంలో ఎపిలోని విజయవాడలోను హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని సున్నిత ప్రాంతాలతో పాటు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సింగ్ నగర్ ప్రాంతంలో ఉదయం ఓ టిఫిన్ బాక్సు కలకలం రేపింది. బాక్సులో బాంబు ఉందనే పుకార్లు వచ్చాయి. అక్కడకు చేరుకున్న పోలీసులు బాక్సును పరిశీలించారు. అందులో బాంబు లేదని తేలడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.