ఇప్పుడే చెప్పలేం: షిండే, పేలుళ్లపై పార్లమెంటులో రగడ
కేర్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించానని, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని షిండే పేర్కొన్నారు. బాధితులకు వైద్య ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన ప్రకటించారు. పేలుళ్ల ఘటనపై ఎన్ఐఎ దర్యాప్తు చేస్తోందన్నారు. దీనిపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని నియమించిందని షిండే తెలిపారు. దాడుల వెనుక ఎవరున్నారనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.
రెండు, మూడు రోజుల కిత్రమే రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించామని, కాని ఒక ప్రాంతంలో జరుగుతుందని చెప్పలేదని, ఈ ఘటనలో పోలీసులు వైఫల్యంపై విచారణలో తేలుతుందని తెలిపారు. పేలుళ్ల ఘటనపై పార్లమెంటులో ప్రకటన చేస్తామని హోంమంత్రి షిండే ప్రకటించారు.
హైదరాబాద్ పేలుళ్లపై పార్లమెంటులో గందరగోళం
దిల్సుఖ్ నగర్ పేలుళ్ల ఘటన పైన పార్లమెంటులో గందరగోళం చెలరేగింది. పేలుళ్లపై ఇరు సభలు దద్దరిల్లాయి. మొదట సభ్యులు పేలుళ్లపై సంతాపం తెలిపారు. అనంతరం సభలో పేలుళ్లపై చర్చకు బిజెపి పట్టుబట్టింది. రాజ్యసభలో వెంకయ్య నాయుడు చర్చించాలని డిమాండ్ చేశారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సంఘటన స్థలాన్ని పరిశీలించారని, ఆయన ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లోకసభలో, రెండున్నర గంటలకు రాజ్యసభలో ప్రకటన చేస్తారని కేంద్రం వివరణ ఇచ్చింది.