'అక్బర్ వ్యాఖ్యలకి సంబంధముందా, ఆ స్థానికులెవరు?'

షిండే ప్రకటనపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రమంత్రి ప్రకటనలో ఎలాంటి పస లేదన్నారు. ఉగ్రవాదుల దాడులు జరుగుతుందనే సమాచారం ముందే ఉంటే ఎందుకు అప్రమత్తం కాలేదని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. షిండే ప్రకటన సాదాసీదాగా ఉందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందే ఎందుకు అప్రమత్తం కాలేదన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన స్థానిక నాయకుల ప్రభావం పేలుళ్ల ఘటన పైన ఉందా అని ఆమె ప్రశ్నించారు.
ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. ఉగ్రవాద నిరోధానికి చేపట్టిన చర్యలేమిటో చెప్పాలన్నారు. షిండే ప్రకటనలో విషయం లేదన్నారు. ఉగ్రవాదాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొనలేవని ఆమె చెప్పారు. ఉగ్రవాద చర్యలను నివారించడంలో కేంద్రం పూర్తిగా విఫలమవుతోందని ఆరోపించారు. ముంబయి, బెంగళూరులలో మరల పేలుళ్లు జరగవని మీరు హామీ ఇవ్వగలరా అని ఆమె షిండేను ప్రశ్నించారు.
సవాళ్లపై చర్యలేవి?: వెంకయ్య
కసబ్, అఫ్జల్ల ఉరితీత తర్వాత ఉగ్రవాదాలు సవాళ్లు విసురుతున్నా కేంద్రం చర్యలు తీవ్రంగా లేవని రాజ్యసభలో బిజెపి నేత వెంకయ్య నాయుడు అన్నారు. పదే పదే బాంబు పేలుళ్లు హైదరాబాదులోనే ఎందుకు జరుగుతున్నాయనే అంశంపై చర్చ జరగాల్సి ఉందన్నారు. ఉగ్రవాదులకు కొందరు స్థానికుల అండ ఉన్నట్లుగా తెలుస్తోందని, ఆ స్థానికులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
పేలుళ్ల ఘటనపై పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. హోంమంత్రి ప్రకటన తమను నిరాశపర్చిందన్నారు. అఫ్జల్ ఉరి తర్వాత పొరుగు దేశంలో సంతాప సభలు జరిగాయన్నారు. పాకిస్తాన్పై కఠినంగా వ్యవహరించాలన్నారు. రాజకీయ పార్టీల మెతక వైఖరి, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఉగ్రవాదం పెచ్చరిల్లుతోందన్నారు. బాంబు దాడులు జరిగితే సంతాప సభలు, పరిహారం ఇంతేనా అని ఘాటుగా ప్రశ్నించారు.
తీవ్ర నేరాలు పాల్పడే వారికి మానవ హక్కులు ఉండవని, మనుషులుగా ప్రవర్తించే వారికి ఉంటాయన్నారు. కేంద్రం సమాచారం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదని ప్రశ్నించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవడంలో కేంద్రం విఫలమవుతోందని ఆరోపించారు. ఉగ్రవాద చర్యలపై కేంద్రం సాదాసీదాగా వ్యవహరిస్తోందన్నారు. ఉగ్రవాదులు దేశాన్ని అస్థిరపర్చాలని చూస్తున్నారని, వారిని సమష్టిగా ఎదుర్కోవాలన్నారు.












Click it and Unblock the Notifications