పేలుళ్లు: సైకిళ్లకు గుర్తింపు కార్డులు, రిజిస్ట్రేషన్ కూడా

మోటారు వాహనాల మాదిరిగానే సైకిల్కూ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయనున్నారు. రిజిస్ట్రేషన్ లేకపోతే కేసు నమోదు చేస్తారు. నాలుగేళ్ల క్రితం వరకూ పేలుళ్లకు స్కూటర్లను ఉపయోగించిన ఉగ్రవాదులు ఇప్పుడు సైకిళ్లను వాడుతున్నారు. వీటికి నెంబరున్నా రిజిస్ట్రేషన్ లేకపోవడమే కారణంగా చెబుతున్నారు.
హైదరాబాదులోని దిల్సుఖ్నగర్ వరుస బాంబు పేలుళ్లతో సహా అంతకు ముందు రాజస్థాన్, పుణెల్లో జరిగిన బాంబు దాడుల్లోను ఉగ్రవాదులు సైకిల్ బాంబులనే ఉపయోగించారు. దీంతో ఉగ్రవాదుల సైకిల్ వ్యూహానికి హోంశాఖ పరిష్కారాన్ని కనుక్కొంది. సాధారణంగా ప్రతి సైకిల్కు సీటు కింద రాడ్పై నెంబరుంటుంది. ఈ నెంబర్తో పాటు, సైకిల్ యజమానులు తమ గుర్తింపు వివరాలతో ఇకపై స్థానిక పోలీసు స్టేషన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే, సైకిల్ కొనుగోలు సమయంలోనే గుర్తింపు పత్రాన్ని దుకాణదారుడికి సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై హోంశాఖ త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. పేలుళ్లలాంటి ఘటనల్లో సైకిళ్లను వినియోగిస్తే ఈ నెంబరు ఆధారంగా దర్యాప్తు జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications