ప్రాజెక్టు ఆపడంలో అర్థంలేదు: బాబ్లీపై ఎపికి ఎదురుదెబ్బ
ప్రాజెక్టు విషయంలో ఎపి వాదన కోర్టులో వీగిపోయింది. ప్రాజెక్టు నిర్మాణం ఆపమని చెప్పడంలో అర్థం లేదని కోర్టు అభిప్రాయపడింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకునేందుకు మహారాష్ట్రకు సుప్రీం కోర్టు అనుమతిని ఇచ్చింది. ఏడేళ్ల సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. 2.47 టిఎంసిలకు మించి నీటిని మహారాష్ట్ర వాడుకునేందుకు అనుమతి లేదని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం 0.6 టిఎంసిల నీటిని విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు పేర్కొంది.
జూలై 3న సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. 2008 మార్చి 26న బాబ్లీ చట్టబద్దతపై పూర్తి స్థాయి విచారణకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. 2012 నవంబర్ 8న బాబ్లీ పైన సుప్రీం కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. మహారాష్ట్ర, ఎపిలు తమ తమ వాదనలు వినిపించాయి.
గతేడాది సెప్టెంబరులో బాబ్లీ ప్రాజెక్టు పూర్తయింది కదా ఇప్పుడేం చేద్దామని సుప్రీం కోర్టు ఆంధ్ర ప్రదేశ్ను ప్రశ్నించింది. దీనిపై అప్పు డే మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. మన రాష్ట్రం తరఫున పరాశరణ్, మహా తరఫున అర్జున్ అనే న్యాయవాదులు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.