PMFME: కేంద్రం ఇచ్చే రూ.10 లక్షల సబ్సిడీ వదులుకోకండి!
దేశంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించడంతో పాటు ఆహార శుద్ధి రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే 'పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్' (PMFME). కొత్తగా చిన్న తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించాలనుకునే వారికి, లేదా ఇప్పటికే నడుస్తున్న పాత యూనిట్లను ఆధునీకరించి విస్తరించాలనుకునే వారికి ఈ పథకం కొండంత ఆర్థిక అండగా నిలుస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకుని సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు.
ఈ పథకం కింద అర్హులైన అభ్యర్థులకు మొత్తం ప్రాజెక్టు ఖర్చులో గరిష్ఠంగా 35 శాతం లేదా గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు క్రెడిట్-లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఉదాహరణకు, మీరు పెట్టబోయే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుబడి ఖర్చు రూ.25 లక్షలు అనుకుంటే.. అందులో 35 శాతం చొప్పున రూ.8.75 లక్షలు సబ్సిడీ రూపంలో లభిస్తుంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా సులభమైన వ్యాపార రుణాల (Business Loans) రూపంలో పొందవచ్చు. దీనివల్ల వ్యాపారం ప్రారంభించడానికి చేతిలో పెద్దగా డబ్బు లేకపోయినా.. సొంతంగా పరిశ్రమ పెట్టాలనే కల నెరవేరుతుంది.

ఈ పథకానికి ఎవరెవరు అర్హులు?
PMFME పథకం కింద వ్యక్తిగత పారిశ్రామికవేత్తలతో పాటు పలు సమూహాలు కూడా లబ్ధి పొందవచ్చు:
వ్యక్తిగత దరఖాస్తుదారులు:
కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి, కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులైన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కుటుంబం నుండి ఒకరికి మాత్రమే ఈ సబ్సిడీ లభిస్తుంది.
సమూహాలు (Groups):
స్వయం సహాయక సంఘాలు (SHGs), రైతు ఉత్పాదక సంస్థలు (FPOs), సహకార సంఘాలు కూడా ఈ పథకం కింద ఉమ్మడి మౌలిక వసతుల కల్పన లేదా ప్రాసెసింగ్ యూనిట్ల కోసం లోన్ మరియు సబ్సిడీని పొందవచ్చు.
ఏయే వ్యాపారాలకు లోన్ ఇస్తారు?
ఆహార పదార్థాల తయారీ, ప్యాకేజింగ్, నిల్వకు సంబంధించిన దాదాపు అన్ని రకాల చిన్న తరహా పరిశ్రమలకు ఈ పథకం వర్తిస్తుంది. ముఖ్యంగా 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్' (OD0P - ఒక జిల్లా ఒక ఉత్పత్తి) కింద ఎంపిక చేసిన స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఉంటుంది.
- పచ్చళ్లు, మసాలా పొడుల తయారీ యూనిట్లు.
- బేకరీ ప్రొడక్ట్స్, స్నాక్స్, బిస్కెట్ల తయారీ.
- పండ్ల రసాలు (జ్యూస్), జెల్లీలు, జామ్ల ప్రాసెసింగ్.
- పిండి మిల్లులు (Flour Mills), పప్పు మిల్లులు, నూనె మిల్లులు (Oil Mills).
- డైరీ ఉత్పత్తులు (పాలు, నెయ్యి, పన్నీర్ తయారీ), మాంసం, చేపల ప్రాసెసింగ్ యూనిట్లు.
దరఖాస్తుకు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి:
- దరఖాస్తుదారుడి ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్.
- విద్యార్హత ధృవీకరణ పత్రం (కనీసం 8వ తరగతి పాస్ సర్టిఫికెట్).
- బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ లేదా క్యాన్సిల్డ్ చెక్ లీఫ్.
- వ్యాపారానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR).
- ఇప్పటికే వ్యాపారం ఉంటే దానికి సంబంధించిన ఉద్యామ్ (Udyam) రిజిస్ట్రేషన్, గత లావాదేవీల వివరాలు.
దరఖాస్తు చేసుకునే విధానం ఇదే..
ఈ పథకం కోసం అర్హులైన అభ్యర్థులు పూర్తిగా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది:
- వెబ్సైట్ ఓపెన్ చేయండి: ముందుగా కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక పోర్టల్ pmfme.mofpi.gov.in ను సందర్శించండి.
- రిజిస్ట్రేషన్: హోమ్పేజీలో 'Online Registration' పై క్లిక్ చేసి, అభ్యర్థి వివరాలతో లాగిన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
- ఫారమ్ పూర్తి చేయండి: ఆ తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్లో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, మీ ప్రాజెక్ట్ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి.
- పత్రాల అప్లోడ్: పైన పేర్కొన్న అన్ని అవసరమైన పత్రాలను (Documents) స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.
పరిశీలన & లోన్ మంజూరు: మీరు సమర్పించిన అప్లికేషన్ను మొదట జిల్లా స్థాయి కమిటీ (DLC) పరిశీలిస్తుంది. అంతా సరిగ్గా ఉంటే, మీ దరఖాస్తును మీరు ఎంచుకున్న బ్యాంకుకు పంపుతారు. బ్యాంక్ అధికారులు మీ ప్రాజెక్ట్ను అంచనా వేసి లోన్తో పాటు సబ్సిడీని మంజూరు చేస్తారు.














Click it and Unblock the Notifications