APSRTC లో ప్రైవేటీకరణ చిచ్చు..! సర్కార్ కు ఉద్యోగుల హెచ్చరిక..!
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్ధ (APSRTC)లో విద్యుత్ బస్సుల కొనుగోళ్లు, వాటి నిర్వహణపై ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. ప్రైవేటీకరణ జరిగితే తప్ప వీటిని నిర్వహించలేమని తేల్చేస్తోంది. దీంతో దశల వారీగా ఆర్టీసీలో ప్రైవేటీకరణ తప్పదన్న అంచనాకు ఉద్యోగులు వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు భారీ ఉద్యమానికి సిద్దమవుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్ ఇవాళ కీలక హెచ్చరికలు చేసింది.
విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుకు ఇవ్వొద్దని ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వానికి సూచించింది. దశలవారి ఆర్టీసి ప్రవేటీకరణపై ఆర్టీసి చైర్మన్ ప్రకటనతో ప్రభుత్వం వైఖరీ వెల్లడైందని ఈయూ నేతలు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 16,17 తేదీల్లో డిపోల వద్ద ధర్నాలు విజయవంతం చేశామని, మే 18న అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమోరాండాలు ఇస్తామని ఉద్యోగ నేతలు తెలిపారు. విద్యుత్ బస్సులు ప్రవేటు ఆపరేటర్ల ఇవ్వకుండా ఆర్టీసీ స్వయంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

మే 26న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం లో భవిష్యత్ ఆందోళనా కార్యక్రమాలు ప్రకటిస్తామని ఆర్టీసీ ఈయూ నేతలు వెల్లడించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహిళా, దివ్యాంగ పథకాల బకాయిలు నెలకి రూః300 కోట్లు పూర్తిగా విడుదల చేయాలని, పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తే ఆర్టీసీ స్వయంగా ఈ-బస్సులు కొనుగోలు చేయగలదని వారు ప్రభుత్వానికి తెలిపారు. ఆర్టీసీలో 10 వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణా సంస్థను కాపాడేందుకు ఉద్యమాలు కొనసాగిస్తామని ఈయూ నేతలు తెలిపారు.














Click it and Unblock the Notifications