దిల్షుక్నగర్ కేసు: బాంబులు పేల్చింది ఆ ఇద్దరే
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్షుక్నగర్ పేలుళ్ల కేసులో దర్యాప్తు సంస్థలు ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. జంట పేలుళ్లకు పాల్పడిన ఇద్దరిని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్కు చెందిన తబ్రేజ్ అలియాస్ అసదుల్లా అక్తర్, వకాస్ అలియాస్ అహ్మద్ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు కూడా 25 - 28 ఏళ్ల మధ్య వయస్సు గలవారిగా గుర్తించినట్లు సమాచారం.
ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుల్లో ఒక్కడైన యాసిన్ భత్కల్కు వారిద్దరు ముఖ్య అనుచరులని సమాచారం. యాసిన్ భత్కల్ సూచనల మేరకే వారిద్దరు హైదరాబాదులో పేలుళ్లకు పాల్పడినట్లు చెబుతున్నారు. వీరిద్దరు కూడా పేలుళ్లకు ఐదు రోజుల ముందు హైదరాబాదు వచ్చి, సంపన్న వర్గాలు ఉండే ప్రాంతంలోని ఓ లాడ్జిలో దిగినట్లు చెబుతున్నారు. పేలుడు పదార్థాలను వెంట తెచ్చుకుని, ఇక్కడే బాంబులను తయారు చేసుకున్నట్లు సమాచారం. పేలుళ్లకు ముందు రెండు రోజుల పాటు దిల్షుక్నగర్లో వారిద్దరు రెక్కీ నిర్వహించారని అంటున్నారు.
హైదరాబాదులోని పాతబస్తీలో గల జుమేరాత్ బజార్లో వారు పాత సైకిళ్లను కొనుగోలు చేసినట్లు, బాంబులను బట్టల్లో చుట్టినట్లు చెబుతున్నారు. పేలుళ్లు సంభవించడానికి 15 నిమిషాల ముందు వాటిని రెండు చోట్ల- కోణార్క్ థియేటర్ వద్ద, వెంకటాద్రి థియేటర్ వద్ద పెట్టినట్లు అనుమానిస్తున్నారు. వాటిని టైమర్లతో పేల్చివేశారని అంటున్నారు. వారికి స్థానికులు సహకరించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2012 ఆగస్టు 1వ తేదీన జరిగిన పూణే పేలుళ్లకు పాల్పడింది కూడా వారిద్దరేనని వారంటున్నారు. అయితే, వారిద్దరు కూడా ఇప్పటి వరకు పోలీసులకు చిక్కలేదు. దిల్షుక్నగర్లో బాంబులు పేల్చిన వెంటనే వారు పారిపోయి ఉంటారని, దేశం విడిచి కూడా వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. యాసిన్ భత్కల్ కూడా దేశంలోనే ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అతని సోదరుడు రియాజ్ భత్కల్ మాత్రం పాకిస్తాన్లో ఉంటూ సౌదీ అరేబియాకు వెళ్లి వస్తుంటాడని చెబుతున్నారు.
కాగా, ఇండియన్ ముజాహిదీన్కు చెందిన ఇమ్రాన్, మక్బూల్లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు హైదరాబాదుకు తీసుకుని వచ్చారు. హైదరాబాదులో ఐదు చోట్ల పేలుళ్లకు పథకం వేసినట్లు గతంలో మక్బూల్ చెప్పాడు. దీంతో మక్బూల్ను విచారిస్తే కీలకమైన సమాచారం రాబట్టవచ్చునని ఎన్ఐఎ అధికారులు భావిస్తున్నారు. పోలీసులు హైదరాబాదులో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇమ్లీన్ బస్టాండ్ వద్ద డెటోనేటర్లు లభించాయి.












Click it and Unblock the Notifications