ఎమ్మెల్సీ పోల్స్: అసద్ మద్దతుకు కెసిఆర్, జగన్ పోటీ
ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మజ్లీస్ నాయకులు చెబుతున్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు వైపే వారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సిఇవో) సోమవారం జారీ చేశారు. ఎమ్మెల్యేల కోటా కింద పది ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నోటిఫికేషన్ జారీ అయింది. ఎమ్మెల్సీలుగా విజయానికి ఒక్కో అభ్యర్థికి 29 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం.
తెరాసకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 17 మందేసి శాసనసభ్యులున్నారు. దాంతో ఆ పార్టీలకు ఏడుగురు సభ్యులున్నమజ్లీస్ మద్దతు అవసరంగా మారింది. ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు, ముగ్గురు బిజెపి శాసనసభ్యులు, నలుగురు సిపిఐ శాసనసభ్యులు ఉన్నారు. వీరి మద్దతు ఎవరికి ఉంటుదనేది కూడా చెప్పలేని స్థితి. బిజెపి, సిపిఐ తెలంగాణవాదాన్ని బలపరుస్తున్నప్పటికీ, కెసిఆర్ తీరు పట్ల ఆగ్రహంతో ఉన్నాయి. అందువల్ల తెరాసకు మద్దతు ఇస్తాయా, లేదా అనేది తేలడం లేదు.
కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మజ్లీస్ వైయస్సార్ కాంగ్రెసుకు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, అక్బరుద్దీన్పై కేసులు, ఇతర అంశాల దృష్ట్యా మజ్లీస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుదనేది కూడా చర్చనీయాంశంగానే మారింది.
మజ్లీస్ మద్దతు కోసమే అన్నట్లుగా తెరాస ముస్లిం అభ్యర్థి మహమూద్ అలీని పోటీకి దింపుతోంది. అయితే, ఆయనకు మజ్లీస్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన కూడా రాలేదు. తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు అసదుద్దీన్ ఓవైసీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మైనారిటీలో కోసం నిలబడిన మజ్లీస్ పార్టీ తాము పోటీకి దించిన మైనారిటీ అభ్యర్థికి మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నామని, అయితే తుది నిర్ణయాన్ని ఆ పార్టీకే వదిలేస్తున్నామని తెరాస నాయకుడు వినోద్ కుమార్ అన్నారు.