కొయ్యలకు అగ్గి పెట్టి, నిప్పుల్లో దూకి రైతు ఆత్మహత్య
కోటమర్పల్లికి చెందిన లాల్రెడ్డి(60)తనకున్న రెండెకరాల పొలంలో పంటలు వేస్తూ పోతున్నాడు. గత మూడేళ్లుగా పంటలు సరిగా పండడం లేదు దీంతో ఈ ఏడాది పెట్టుబడుల కోసం లాల్రెడ్డి తమ భూమిపట్టా పాసుపుస్తకాలను మర్పల్లి ఆంధ్రాబ్యాంకులో తనఖా పెట్టి రూ.80 వేలు అప్పుతీసుకున్నాడు. ఇవేకాకుండా మరో రూ.1.50 లక్షలు ప్రైవేటు అప్పు తీసుకున్నాడు. అయినా లాల్రెడ్డిని విధి వెక్కిరించింది. దిగుబడికి వచ్చిన డబ్బు లు అప్పులవడ్డీకి కూడా సరిపోలేదు.
తమ పొలంలో కోసేసిన మొక్కజొన్న, కంది కొయ్యకట్టెలతోపాటు పొలంలోని చెత్తాచెదారం తగులబెట్టేందుకు వెళుతున్నానని శనివారం కుటుంబసభ్యులతో చెప్పి లాల్రెడ్డి పొలానికి బయలుదేరాడు. రాత్రి ఎంతసేపయినా లాల్రెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆయన కుమారుడు నర్సింహారెడ్డి తండ్రి కోసం వెతికాడు.
ఆదివారం ఉదయం కూడా రాకపోవడంతో కుమారుడు పొలానికి వెళ్లిచూడగా, తగులబెట్టిన మొక్కజొన్న, కంది కొయ్యకట్టెల మధ్య కాలిపోయిన లాల్రెడ్డి మృతదేహం కనిపించింది. దాంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు లాల్రెడ్డి మృతదేహానికి మర్పల్లి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం పాశిగాం గ్రామానికి చెందిన కౌలు రైతు కంటెం పోచయ్య (65) ఆత్మహత్య చేసుకున్నాడు. పోచయ్య తను కౌలుకుతీసుకున్న మూడెకరాల్లో పత్తి సాగు చేశాడు. వర్షాభావం వల్ల పత్తిచేను ఎండిపోవడంతో సాగుకోసం చేసిన అప్పులు తీర్చేమార్గం కానరాక పోచయ్య శనివారం రాత్రి తన ఇంట్లోనే ఉరివేసుకున్నాడు.