ఇఫ్లూలో కాశ్మీర్ విద్యార్థి ఆత్మహత్య: రెండు చోట్ల ఉద్రిక్తత
గతంలో ఇఫ్లూలోనే ఇంగ్లీషులో ఎంఫిల్ చేసి, ప్రస్తుతం పిహెచ్డి చేస్తున్న ముదస్సిర్ కమ్రాన్ (30)కు ఇటీవల స్నేహితులతో గొడవ జరిగింది. దీంతో కాలేజీ ప్రోక్టర్ (అడ్మినిస్ట్రేటివ్ అధికారి) ప్రొఫెసర్ హరీష్ కుమార్ విజ్రా గొడవ పడిన విద్యార్థులిద్దరినీ ఉస్మానియా పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. అక్కడి ఎస్ఐ కమ్రాన్కు కౌన్సెలింగ్ చేసి మూడు గంటల పాటు పోలీసు స్టేషన్లోనే ఉంచారు.
తాను తప్పు చేయలేదని, అయినా స్టేషన్లో ఉండాల్సి వచ్చిందని తీవ్ర మనస్తాపానికి గురైన కమ్రాన్ హాస్టల్లోని ఐదో నెంబరు గది లో శనివారం రాత్రి 9.30 సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముదస్సిర్ మృతదేహంతో విద్యార్థులు ఇఫ్లూలో ఆదివారం ఉదయం వరకు ఆందోళన చేపట్టారు. అతడి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆత్మహత్యకు ప్రేరేపించిన ప్రోక్టర్ను సస్పెండ్ చేసి ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
దానిపై స్పందించని పోలీసులు.. ముదస్సిర్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి అనంతరం అతడి స్వగ్రామమైన కాశ్మీర్లోని పుల్వామా జిల్లా పరిగామ్ ప్రాంతానికి ప్రత్యేక విమానంలో పంపేశారు. అయితే.. ముదస్సిర్ ఆత్మహత్యకు ప్రధాన కారణం ప్రోక్టర్ హరీష్ కుమారేని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ఆదివారం ఇఫ్లూ క్యాంపస్లో ఆందోళనకు దిగారు.
ప్రొఫెసర్ హరీష్కుమార్ విజ్రాపై విద్యార్థులు ఓయూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ముదస్సిర్ మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వర్సిటీ బంద్కు పిలుపునిచ్చారు. ముదస్సిర్ ఆత్మశాంతిని కోరుతూ విద్యార్థులు ఇఫ్లూలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇఫ్లూలో చదువుతున్న కాశ్మీరీ విద్యార్థులతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఫోన్లో మాట్లాడారు.