ఉగ్రవాద ముప్పు: హైదరాబాద్కు తాజా హెచ్చరికలు
వచ్చే 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఐబి సూచించింది. దీంతో హైదరాబాదులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. రోడ్లపై, లాడ్జీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ కూడళ్ల వద్ద మైకుల్లో ప్రకటనలు చేస్తున్నారు.
లుంబినీ పార్క్లో పోలీసులు తనిఖీలు జరిపారు. ఐమాక్స్ వద్ద ఆక్టోపస్ సోదాలు చేస్తోంది. వనస్థలిపురంలో పోలీసులు తనిఖీల్లో రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన విచారణ జరుపుతున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లతో భయభ్రాంతులకు గురైన హైదరాబాదీలు తాజా హెచ్చరికలతో వణికిపోతున్నారు. అప్పట్లో నిఘా హెచ్చరికలను పట్టించుకోలేదన్న ఆరోపణలు రావడంతో ఈసారి పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గత నెల జరిగిన బాంబు దాడి నేపథ్యంతో నగరమంతా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు తాజా హెచ్చరికలతో మరింత క్షుణ్ణంగా అన్ని పరిశీలిస్తున్నారు. ఇటు నగరవాసులు కూడా తమ బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలని, పోలీసులకు సహకరించాలని సూచిస్తున్నారు.
కాగా నగరంలోని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. బుధవారం ఉదయం యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమృత రవి అనే యువకుడు మృతి చెందాడు. రవి కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలం బేగంపేట వాసి. రవి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.