లోకేష్ ఫీజు ఎవరు కట్టారు?, అనిల్పై బురద: జగన్ పార్టీ
చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు వచ్చిన మార్కులకు రాష్ట్రంలోని చిన్న కళాశాలలో కూడా సీటు రాదని అలాంటప్పుడు ఆయనకు ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో సీటు రావడానికి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరు కట్టారని ప్రశ్నించారు. దీనిపై విచారణకు చంద్రబాబు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ ఆస్తులు అమ్మి ఫీజులు కట్టారో చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు.
చంద్రబాబు తన కుటుంబ సభ్యులందరినీ మనీ లాండరింగ్ కోసం వాడుకున్నారని ఆరోపించారు. తమ ఆరోపణలుకు సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు స్వయంగా తనపై విచారణ జరిపించుకోవాలని హితవు పలికారు. లోకేష్, చంద్రబాబుల విదేశీ యాత్రల గుట్టు బయట పెట్టాలన్నారు.
బ్రదర్ అనిల్ కుమార్ స్పందన పైన టిడిపి, బిజెపి నేతలు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదన్నారు. తనపై ఆరోపణలు చేసే వారిపై బ్రదర్ అనిల్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. వైయస్ కుటుంబం పైన బురద జల్లితే ప్రజలు ఊరుకోరన్నారు.
అనిల్ పైన ఆధారాలు లేని ఆరోపణలు
బ్రదర్ అనిల్ కుమార్ పైన టిడిపి, బిజెపిలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తోందని మరో నేత జూపూడి ప్రభాకర రావు అన్నారు. వైయస్ కుటుంబం పైన ఒకరి తర్వాత మరొకరు కక్ష కట్టి విమర్శలు గుప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. టిడిపితో బిజెపి కుమ్మక్కయిందన్నారు. విశ్వసనీయత లేని చంద్రబాబు ఆరోపణలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోరన్నారు. 2004, 2009లో ప్రజలు బాబుకు బుద్ధి చెప్పారని, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోను ఓడిపోయారని అయినా మారలేదన్నారు.