జగన్ పార్టీలోకి టిడిపి ఎమ్మెల్సీ: కొడుకుకి టికెట్ కోసమే!

బొడ్డు భాస్కర రామారావు తన తనయుడికి రాజమండ్రి పార్లమెంటు టిక్కెట్ కోసమే జగన్ పార్టీలో చేరినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, రాజమండ్రి పార్లమెంటు టిక్కెట్ స్థానం పైన ఆయనకు హామీ వచ్చిందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఈ నియోజకవర్గం కోసం పలువురు క్యూలో ఉన్నారు.
ఇరవై రోజుల క్రితం బొడ్డు భాస్కర రామారావు అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న విషయం తెలిసిందే. తాను జగన్ పార్టీలో చేరుతానని ఆయన అప్పుడే చెప్పారు. జగన్ను కలిసిన అనంతరం ఆయన అప్పుడు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు.
చంద్రబాబు వైఖరి నచ్చకపోవడం వల్లనే తాను ఆ పార్టీని వీడినట్లు చెప్పారు. తాను పార్టీని వీడినప్పటికీ కార్యకర్తలు కూడా తన వెంటే ఉన్నారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి పేద ఇంటికి చేరాయన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వైయస్ జగన్ కీలక పాత్ర పోషిస్తారని ఆయన జోస్యం చెప్పారు. వైయస్ పథకాలు కొనసాగించడం ఒక్క జగన్కే సాధ్యమన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై వైయస్ కుటుంబాన్ని వేధిస్తున్నాయని ఆరోపించారు.
వైయస్ జగన్కు అండగా ఉండాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జైల్లో ఉన్న జగన్ను కలిసిన తాను ఆయనతో తన అభిప్రాయాలు పంచుకున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లేదని ఆయన ఆరోపించారు. సమైక్యవాదంపై టిడిపి వైఖరి తనకు నచ్చలేదన్నారు. జగన్ను బొడ్డును కలవడంతో టిడిపి కూడా ఆయన పైన వేటు వేసింది. ఈ రోజు ఆయన అధికారికంగా పార్టీలో చేరారు.
జగన్ను కలిసిన జంపన ప్రతాప్
కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ శుక్రవారం ఉదయం ములాకత్ సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications