సోనియా ముద్ర: కాంగ్రెసు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
ఎమ్మెల్సీ అభ్యర్థులకు రేపు బీఫామ్స్ ఇవ్వనున్నట్లు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. నామినేషన్ల దాఖలుకు అమావాస్య అడ్డంకి కాదని ఆయన అన్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి, ధీరావత్ భారతి, వాణి, రఘురామిరెడ్డి, కంతేటి సత్యనారాయణ రాజు, దయాసాగర్, షబ్బీర్ అలీ పేర్లు ఎమ్మెల్సీ టికెట్లు దక్కుతాయని భావిస్తున్నవారిలో ఉన్నారు.
శుక్రవారం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ పలుమార్లు అధిష్టానం పెద్దలను కలిసి చర్చలు జరిపారు. వీరిద్దరు సమర్పించిన జాబితాను అధిష్టానం ఆమోదించకపోవడంతో శుక్రవారం కసరత్తు ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. కొత్తవారికి టికెట్లు ఇవ్వాలనే ఆలోచనలో సోనియా గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికపై సోనియా ముద్ర ఉంటుందని అంటున్నారు.
సోనియానే స్వయంగా పరిశీలించడంతో ముందు అనుకున్న జాబితాలో మార్పులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. బొత్స సత్యనారాయణ 165 మంది పేర్లతో జాబితాను అధిష్టానానికి సమర్పించినట్లు చెబుతున్నారు. అయితే, టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను ఆయన అందించారని, వడపోత చేయకుండానే ఆయన దాన్ని అందించారని చెబుతున్నారు.
కాగా, ఎమ్మెల్సీ జాబితాను ఖరారు చేయించుకోవడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం హైదరాబాదు తిరిగి వస్తున్నారు. బొత్స సత్యనారాయణ మాత్రం ఈ రాత్రి అక్కడే మకాం వేస్తున్నారు. కాగా, కాంగ్రెసు ఐదుగురు అభ్యర్తులను మాత్రమే పోటీకి దింపుతున్నట్లు తెలుస్తోంది.