జగన్ను అడగలేదు: నామినేషన్ వేసిన అప్పారావు

తాను తెలుగుదేశం పార్టీలో 18 ఏళ్ల పాటు ఉన్నానని, రాజమండ్రి మేయర్గా తన భార్యను గెలిపించుకున్నానని, అంతకు మించి తనకు పదవులు దక్కలేదని, తగిన స్థానం దక్కలేదని తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసులోకి వచ్చానని ఆయన అన్నారు. వైయస్ జగన్ నాయకత్వంలోనే బీసిలకు న్యాయం జరుగుతుందని నిరూపితమైందని ఆయన అన్నారు. కులవృత్తులు నశిస్తాయని అనుకుంటున్న తరుణంలో ఆ వర్గాలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే జగన్ తనను ఎమ్మెల్సీ సీటుకు ఎంపిక చేశారని ఆయన అన్నారు.
తనకు ఎమ్మెల్సీ సీటుకు ఎంపిక చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు ఇస్తామని కొన్ని రాజకీయ పార్టీలు గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో ఏమీ చేయడం లేదని అన్నారు. జగన్ ఆచరణలో బీసీలకు ప్రాధాన్యం కల్పించారని ఆయన అన్నారు. కె. ఎర్రంనాయుడి వియ్యంకుడిని అయినంత మాత్రాన తాను వైయస్సార్ కాంగ్రెసులో ఉండకూడదని ఏమీ లేదని ఆయన అన్నారు.
బీసీలకు మేలు చేయాలన్నదే జగన్ ఆలోచనా విధామని, అందుకే ఒక్క ఎమ్మెల్సీ సీటును వెనకబడిన తరగతులకు చెందిన ఆదిరెడ్డి అప్పారావుకు కేటాయించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్షం ఉపనేత ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అప్పారావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వల్ల బీసీలకు న్యాయం చేసినట్లయిందని, ఇది చాలా సముచితమైన నిర్ణయమని ఆయన అన్నారు.
అప్పారావు ఒక్క బీసీల్లోనే కాదు, ఇతర వర్గాల ప్రజలతో కూడా కలిసి మెలిసి ఉంటారని ఆయన చెప్పారు. రెండో అభ్యర్థిని రంగంలోకి దించుతారా అని అడిగితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని ధర్మాన కృష్ణదాస్ పక్కనే ఉన్న గండికోట శ్రీకాంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఎదుటి పక్షం వ్యూహాలను బట్టి తమ వైఖరి ఉంటుందని దర్మాన చెప్పారు. మీ అభ్యర్థి విజయానికి కావాల్సినంత మంది ఎమ్యెల్యేలున్నారా అని అడిగితే పోలింగులో తెలుస్తుంది కదా తమ బలమని, తొందర ఎందుకుని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications