సభలో సత్తా చూపిస్తాం: బాబు, జగన్కు బొత్స సవాల్
బడ్జెట్ సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెసు లేదా తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెడితే తాము ఎదుర్కొంటామని, తమ సభ్యుల బలం ఎంతో, తమ పార్టీ సత్తా ఏమిటో అసెంబ్లీలోనే చూస్తారన్నారు. పార్టీని వీడిన వారిపై వేటు వేస్తే తద్వారా వచ్చే ఉప ఎన్నికలకు కూడా తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. ఉప ఎన్నికలు తప్పు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు నిత్యం అవిశ్వాసం పైన సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్న విషయం తెలిసిందే. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి టిడిపి మద్దతుగా నిలుస్తోందని, అదే అబద్దమైతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేస్తుండగా... మీతో వచ్చే అధికార పార్టీ ఎమ్మెల్యేలతో గవర్నర్ ఎదుట పరేడ్ చేయించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.
శనివారం జగన్ సోదరి షర్మిల తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా గుంటూరు జిల్లాలో టిడిపికి కొత్త సవాల్ విసిరారు. తాము అవిశ్వాసం పెడతామని, టిడిపి తమతో కలిసి వస్తుందా లేదా చెప్పాలని షర్మిల చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేశారు.