ఒక్కదెబ్బకు: అనుకోని ఆయుధం అజహర్!
కానీ, పద్నాలుగేళ్లుగా తమకు అండగా నిలబడిన మజ్లిస్ పార్టీ ఒక్కసారిగా దూరం జరగడంతో రాష్ట్రంలోని ముస్లింలు తమకు దూరమవుతారేమోననే ఆందోళన ఆ పార్టీలో కనిపించింది. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలను ఎదుర్కోవడం వేరు! మజ్లిస్ పార్టీ దూరం కావడం వేరు! ఇప్పటికే తెలంగాణలో, సీమాంధ్రలో అష్టకష్టాలు పడుతున్న మజ్లిస్ పార్టీ దూరం కావడంతో ముస్లిం వర్గాలు జగన్ వైపు వెళ్తాయేమోననే ఆందోళన కాంగ్రెసులో కనిపించింది.
బయటకు మాత్రం ఎక్కడా ఆ ఆందోళన కనిపించలేదు. పైగా మజ్లిస్ పార్టీ పైన ఎదురుదాడికి దిగారు. మజ్లిస్ పార్టీ మతతత్వ పార్టీ అని, ఆ పార్టీతో ముస్లింలు లేరని విమర్శలు గుప్పించింది. అయితే, కాంగ్రెసు నేతల్లో మాత్రం లోలోన ఆందోళన కనిపించిందనే చెప్పవచ్చు. కానీ, ఇప్పుడు భారత మాజీ క్రికెట్ సారథి మహమ్మద్ అజహరుద్దీన్ రూపంలో ప్రత్యమ్నాయం దొరకడం పార్టీ వర్గాల్లో అనందం వ్యక్తమవుతోందట. అసద్ను ఎదుర్కొనేందుకు, ముస్లింలను ఆకట్టుకునేందుకు, జగన్ వైపు మరలకుండా ఉండేందుకు అజహరుద్దీన్ ఉపయోగపడుతారని భావిస్తున్నారు.
శనివారం అజహరుద్దీన్ మాట్లాడుతూ... తనకు ఎపి రాజకీయాలపై ఆసక్తి ఉందని, పార్టీ ఆదేశిస్తే హైదరాబాదు నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అజహర్ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెసు వర్గాల్లో కొత్త ఊపును తీసుకు వచ్చాయని అంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అజహరుద్దీన్ పోటీ చేస్తే కాంగ్రెసు పార్టీకి పెద్ద ఎత్తున ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అందులోనూ మజ్లిస్ పార్టీ హవా కొనసాగుతున్న హైదరాబాదు నుండి పోటీ చేస్తే ముస్లిం వర్గాలు కాంగ్రెసుకు అండగా ఉంటాయని భావిస్తున్నారు.