జగన్ పార్టీలో విబేధాలు: కేంద్ర కార్యాలయం వద్ద ధర్నా
కాకినాడ రూరల్కు చెందిన పలువురు నాయకులు పార్టీ కార్యాలయానికి తరలి వచ్చారు. గడిచిన మూడేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ అభ్యున్నతి కోసం పని చేస్తున్న స్థానికులు మామిడాల వెంకటేశ్, గొబ్బల వెంకటేశ్వర రావు, అత్తిలి సీతారామ స్వామిలను కాకుండా ఇటీవల కాంగ్రెస్ నుంచి వచ్చిన స్థానికేతరుడు, రాజోలు నియోజకవర్గానికి చెందిన జడ్పీ మాజీ చైర్మన్ వేణు గోపాల కృష్ణను పార్టీ కాకినాడ రూరల్ ఇన్చార్జిగా నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆ సమయంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న నేతలు వారిని అక్కడే కొంతసేపు కూర్చోబెట్టారు. బయట మీడియా రూంలో ఉండే విలేకరులు సాయంత్రం వెళ్లిపోయాక, బయటికి వెళ్లాలని కోరారు. దీంతో వారు పార్టీ కార్యాలయంలోనే ఆందోళనకు దిగారు. స్థానికులకే న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీతాకోక చిలుకలు మాకొద్దని, తాము ఎంతకాలం గొంగడి పురుగు వ్యవస్థలో ఉండాలని, కష్టపడి పని చేసిన కార్యకర్తలను గుర్తించాలని నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడేళ్లుగా పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా, ఎక్కడో 13 నియోజక వర్గాల బయట ఉండే వేణును ఇన్చార్జిగా మాపై రుద్దారని, కాంగ్రెస్లో ఉన్నప్పుడు జగన్ వెంట వెళ్లే వాళ్లంతా అలీబాబా 40 దొంగలు, 420లని ఆయన విమర్శించారని, ఇప్పుడు ఆయనే తమ పార్టీలోకి వచ్చారని, అలాంటి వ్యక్తిని ఇన్చార్జిగా నియమించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన మమైసూరా రెడ్డి వారిని తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడారు. మైసూరా రెడ్డితో పాటు మరో నేత జ్యోతుల నెహ్రూలు వారితో మాట్లాడారు. వేణును ఎట్టి పరిస్థితుల్లో తప్పించాలని వారు డిమాండ్ చేశారు. రాత్రి పొద్దుపోయేదాకా ఈ చర్చ కొనసాగింది.