తిన్నదంతా కక్కిస్తా, అప్పుడే వైఎస్ను నిలదీశా: బాబు
కొల్లేరులో బాంబులు పెట్టి చెరువులను ధ్వంసంచేసే హక్కు ఎవరిచ్చారని అప్పట్లోనే తాను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని నిలదీశానని చెప్పారు. ఇక్కడ కాదు.. కొల్లేరు ప్రజల ముందు తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరానని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పేరిట అప్పటి వైయస్ ప్రభుత్వం వేల కోట్లు మేసేసిందని దుయ్యబట్టారు. మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డ కొల్లేరు ప్రజలను వైయస్ అన్నివిధాలా వంచించారని ధ్వజమెత్తారు.
అధికారంలోకి వస్తే కాంటూరును ఫ్లస్ త్రీకి కుదించి అక్రమంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాల చెరువులను పేదలకు పంచుతానని హామీ ఇచ్చారు. కొల్లేరులో చెరువులను బాంబులతో ధ్వంసం చేసి ఆ పాపాన్ని వైయస్ తమకు అంటకట్టే ప్రయత్నం చేశారని, అప్పట్లో ప్రజలు కూడా దాన్ని నమ్మారని, కొన్నాళ్ళకు వాస్తవాలు వెల్లడయ్యాయని చెప్పారు. దాళ్వాకు నీరు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం మొండి కేస్తుందని, డెల్టా ఆధునికీకరణ పేరిట రూ.4,600 కోట్ల నిధులు నీటి పాలు చేసి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తే కాంగ్రెసు పార్టీ అవినీతిలో ముందుకు తీసుకు వెళ్లిందని ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డిది దోపిడీ కుటుంబమని మండిపడ్డారు. టిడిపి అధికారంలోకి రాగానే రైతుల రుణ మాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పారు.