కాంగ్రెసుకు పెద్దిరెడ్డి గుడ్బై: జగన్ వైపు అడుగులు?
పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. ఆయన జగన్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో ఆయన జగన్ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తానని బహిరంగంగా ప్రకటించారు.
సహకార సంఘ ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రకటించే అభ్యర్థికే ఓటు వేసి గెలుపునకు కృషి చేస్తానని కాంగ్రెసు పార్టీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆదివారం అన్నారు. జగన్ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ఆయన తన అనుచరులకు సూచించారు. ఢిల్లీ పెద్దలు ఏమన్నా లెక్క చేయనన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిరంకుశ పాలనలో రాష్ట్ర ప్రజలు, కాంగ్రెసు నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పని చేసే వారికి కాంగ్రెసు పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి వ్యవసాయం గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. కిరణ్ సర్కారు రైతులకు ఏమీ చేయలేదన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుండి ఆయన పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. కిరణ్ను దించేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేశారు. పలుమార్లు అదిష్టానానికి అల్టిమేటం కూడా జారీ చేశారు. అయినప్పటికీ అధిష్టానం వినక పోవడంతో ఆయన ఈ రోజు రాజీనామా చేశారు. ఆయన జగన్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు జిల్లాలో ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది.