జర్మన్ యువతి రేప్: బిట్టి కాదని బుకాయింపు
తిరువనంతపురం: కేరళలోని కన్నూరు జిల్లాలో అరెస్టయిన వ్యక్తి జర్మన్ యువతిపై అత్యాచారం కేసులో దోషి బిట్టి మొహంతి కాడని పోలీసులు బుకాయిస్తున్నట్లు తెలుస్తోంది. జర్మన్ యువతిపై అత్యాచారం చేసి శిక్ష పడిన బిట్టి మొహంతినే తాము అరెస్టు చేశామని తొలుత అంగీకరించిన చెప్పిన పోలీసులు మాట మార్చినట్లు తెలుస్తోంది. బిట్టి మొహంతిగా అనుమానించి ఆ వ్యక్తిని కేరళ పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు.
కాగా, అతన్ని గుర్తించడానికి రాజస్థాన్ పోలీసులు సోమవారం కేరళకు చేరుకునే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావంకోర్లో పనిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కేరళ పోలీసులు చెప్పారని, కేరళ చేరుకున్న తర్వాత అతన్ని గుర్తిస్తామని రాజస్థాన్కు చెందిన లాల్కోఠీ స్టేషన్ హౌస్ మాస్టర్ సంపత్ సింగ్ చెప్పారు.

బిట్టి మొహంతి ఒడిషా మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ బిబి మొహంతి కుమారుడు. బిట్టి మొహంతి 2006 మార్చి 21వ తేదీన రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలో జర్మన్ యాత్రికురాలిపై అత్యాచారం చేశాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2006 ఏప్రిల్ 12వ తేదీన బిట్టీని దోషిగా తేల్చింది. అతనికి ఏడేళ్ల జైలు శిక్ష కూడా పడింది.
అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి చూడడానికి అతను 2006 నవంబర్లో పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. బిట్టీని తప్పించడంలో అతని తండ్రి తన అధికార హోదాను ఉపయోగించాడనే ఆరోపణలు ఉన్నాయి. బిట్టీ తండ్రి బిబి మొహంతిని 2008 జనవరిలో అరెస్టు చేశారు. కొద్ది రోజులు కస్టడీలో ఉన్న తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. అతన్ని సస్పెండ్ చేసి, తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications