పోలీసులమని బైక్ని అడ్డగించి యువతిపై గ్యాంగ్ రేప్
జైపూర్: పోలీసుల ముసుగులో ఓ ఇరవై ఏళ్ల యువతి పైన ఇద్దరు దుండగులు దారుణానికి ఒడిగట్టారు. రాజస్థాన్లోని జైపూర్లో ఓ యువతి తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనం పైన మార్చి ఏడవ తేదిన వెళుతుండగా.. మరో ద్విచక్ర వాహనం పైన వచ్చిన ఇద్దరు రావత్బాటా రోడ్డు వద్ద వారిని అడ్డగించారు. తర్వాత యువతిపై అత్యాచారం చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించారు. మోహన్ సింగ్, జై కుమార్లు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. మోహన్ సింగ్, జై కుమార్లో ఆ రోజు యువతి తన స్నేహితుడితో కలిసి వెళ్తుండగా వాహనాన్ని ఆపి తమకు తాము పోలీసులమని చెప్పుకున్నారు.
వాహనానికి సంబంధించిన పేపర్స్ అడిగారు. తమతో పాటు పోలీస్ ఔట్ పోస్టుకు రావాలని ఆదేశించారు. వారి తీరుపై అనుమానం కలిగింది. జై కుమార్ బలవంతంగా యువతిని బైక్ పైన కూర్చుండబెట్టాడు. మోహన్ సింగ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. యువతిని వారిద్దరు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశారు. అప్పటికే స్నేహితుడిని వారు కొట్టారు.
ఆ తర్వాత యువతి తన స్నేహితుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోహన్ సింగ్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతనిని మార్చి 16 వరకు జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. మరో నిందితుడు జై కుమార్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.
బాధిత యువతి నగరంలోని కోటా సిటీలో ఉంటోంది. అమె మెడికల్ కోచింగ్ క్లాసులకు అటెండ్ అవుతోంది. కాగా, నిందితులు స్థానికంగానే ఉంటారు. 2006లో రాబరీ కేసులో వారు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.