జగన్ మీడియాపై బాబు ఫైర్, వస్తాడని షర్మిల
తననూ మీడియా పెట్టాలని అడుగుతున్నారని, అక్రమ సంపాదనతో డబ్బా కొట్టుకోవాల్సిన కర్మ తనకు పట్టలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అస్తవ్యస్త పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చంద్రాబాబు అన్నారు. మరో పక్క పిల్ల కాంగ్రెసు (వైయస్సార్ కాంగ్రెసు) కేసులను మాఫీ చేసుకునేందుకు తల్లి కాంగ్రెసు (కాంగ్రెసు)తో ఒప్పందాలు చేసుకుంటోందని ఆయన విమర్శించారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వైయసస్ షర్మిల అన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె మంగళవారం గుంటూరు జిల్లా సొలస గ్రామం వచ్చారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ప్రసంగించారు.
వర్షానికి మిర్చి, పత్తి పంట తడిసినా ఆదుకునే దిక్కు లేదని ఆమె అన్నారు. తండ్రిలా ఆలోచించడం వల్లనే వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. వైయస్సార్ ఉంటే 9 గంటలు విద్యుత్తు ఇచ్చి ఉండేవారని ఆమె అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడినందుకే జగనన్నపై కాంగ్రెసు కక్ష కట్టిందని ఆమె అన్నారు.
తల్లిదండ్రులు తమ చదువులకు ఫీజులు చెల్లించలేక పెళ్లిళ్లు చేస్తున్నారని కొందరు విద్యార్థినులు షర్మిలకు చెప్పారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అన్ని కష్టాలూ తీరుతాయని ఆమె హామీ ఇచ్చారు. ప్రజల ఆశీస్సులతో తమ పార్టీ రెండేళ్లు పూర్తి చేసుకుందని షర్మిల అన్నారు. భవిష్యత్తులో 200కు పైగా ఎమ్మెల్యే సీట్లు, 35 ఎంపి సీట్లు గెలుచుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.