కెసిఆర్ కంటే నేనెక్కువ, జగన్ కుట్ర: భయపడనని కిరణ్
ప్రతిపక్షాలు పార్టీని పడగొట్టే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సహకార ఫలితాలే పునరావృతం అవుతాయని చెప్పారు. విపక్షాల కుట్రను ప్రజలు తిప్పి కొడుతారన్నారు. అభివృద్ధికి అడ్డుపడితే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారని అయినా, ఆయన కంటే తానే ఎక్కువగా ఈ జిల్లాలో పర్యటించానని చెప్పారు.
తాను భయపడే వ్యక్తిని కాదని, చాలా మొండివాడినని చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను ఎన్నోసార్లు మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చానని కానీ, కెసిఆర్ ఎన్నిసార్లు వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక ఉద్యమాలకే ఇక్కడి నేత ముందుగా ఉంటారని విమర్శఇంచారు. ప్రజలకు ఇచ్చిన హామీలనన్నింటిని తాము నెరవేరుస్తున్నామని చెప్పారు. 2014 వరకు ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు.
తెలంగాణ సెగ
సభలో పలువురు తెలంగాణ నినాదాలు చేయగా ముఖ్యమంత్రి స్పందించారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకునే వరకు ఓపిక పట్టాలని సూచించారు. తెలంగాణపై నిర్ణయానికి కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన వినతులకు నెలలో పరిష్కారం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా భూ సమస్యల పైన ప్రజల నుండి కిరణ్ వినతులు స్వీకరించారు.
ఆ మూడు పార్టీల తీరు ఇది...
ప్రజా సంక్షేమం కోసం కెసిఆర్ ఎప్పుడూ మాట్లాడలేదని మంత్రి కొండ్రు మురళీ మోహన్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో లుకలుకలు అందరికీ తెలుసునని చెప్పారు. టిడిపి రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆయా నేతలు తమ పార్టీలను బతికించుకునేందుకే అవిశ్వాసం అంటున్నారని విమర్శించారు. విపక్షాలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఈ ఉగాది నుండి హెల్త్ కార్డుల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు కొండ్రు మురళి చెప్పారు. వంద శాతం ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు సంతృప్తి చెందేలా నిర్ణయం ఉంటుందన్నారు. ఇప్పటికే సంబంధిత ఫైలు ముఖ్యమంత్రి వద్దకు పంపించామన్నారు.
ప్రభుత్వానికి ఢోకా లేదు
ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో అన్నారు. 2014 వరకు రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినా ఎలాంటి భయం లేదన్నారు. తమకు తగిన సంఖ్యా బలం ఉందన్నారు.