కెసిఆర్, షర్మిల చెప్తే కాదు: రేవంత్, మద్దతన్న బిజెపి
సమయం, సందర్భం వచ్చినప్పుడు అవిశ్వాసం పెడుతామన్నారు. రాజకీయాల్లో వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయని చెప్పారు. కెసిఆర్ ఇప్పుడు అవిశ్వాసం అని చెప్పడం ద్వారా కాంగ్రెసు ప్రభుత్వాన్ని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అవిశ్వాసం పెడుతామని చెప్పడం ద్వారా కాంగ్రెసు తమకు వ్యతిరేకంగా ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేసి అవిశ్వాసాన్ని ఎదుర్కొనే అవకాశముందన్నారు.
కాంగ్రెసుతో కుమ్మక్కైన తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు బుద్ధి చెబుతామన్నారు. తమది ప్రధాన ప్రతిపక్షమని, అలాంటప్పుడు ఇతర పార్టీలతో వెళ్లాల్సిన అవసరమేముందన్నారు. అవసరమనుకుంటే తామే అవిశ్వాసం పెడతామన్నారు. కెసిఆర్ వైఖరి కాంగ్రెసు ప్రభుత్వాన్ని రక్షించేందుకు ముందే హెచ్చరించినట్లుగా ఉందని ఈ సందర్భంగా రేవంత్ చెప్పారు.
అవిశ్వాసానికి మద్దతు
కాంగ్రెసు ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా తాము మద్దతిస్తామని బిజెపి శాసనసభా పక్ష నేత యెండల లక్ష్మీ నారాయణ అన్నారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటింగులో పాల్గొంటామని చెప్పారు. విద్యుత్ సంక్షోభం, బాబ్లీ వైఫల్యానికి కాంగ్రెసు పార్టీయే కారణమన్నారు. తెలంగాణ అంశంలో కాంగ్రెసు పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. తాగునీరు, బాబ్లీ అంశాల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. ప్రజా సమస్యల విషయంలో విపక్షాలు ఏకతాటి పైకి రావాలన్నారు.
అవిశ్వాసం ఆలోచన మంచిదే
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పైన అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచన మంచిదేనని బిజెపి సీనియర్ నేత విద్యాసాగర రావు కరీంనగర్ జిల్లాలో అన్నారు. అవిశ్వాసం పెడితే ఇతర ప్రతిపక్షాలకు తోడుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ రాక తప్పదన్నారు. అవిశ్వాసం పెడితే మేకవన్నె పులుల రంగు బయట పడుతుందన్నారు.