కర్నాటక స్థానికంలో మజ్లిస్ హవా: అక్బర్ హంగామా
మజ్లిస్ పార్టీ శాసన మండలి సభ్యుడు సయీద్ అమిన్ జాఫ్రి చెప్పన ప్రకారం... బీదర్లో ఎనిమిది వార్డులలో తాము బలపర్చిన అభ్యర్థులు పోటీ చేశారని, అందులో ముగ్గురు గెలుపొందారని చెప్పారు. వార్డు నెంబర్ 1, 7, 28ల నుండి అబ్దుల్ అజిజ్, సయీద్, శివానంద్ శంకర రావులు గెలుపొందారని చెప్పారు. బసవకల్యాణంలో ఆరు వార్డులలో స్వతంత్ర అభ్యర్థులను తాము బలపరిచామని అందులో ముగ్గురు గెలుపొందారని చెప్పారు. వార్డు నెంబర్ 5, 9, 31లలో సుల్తాన్ అలీ, ముసా మియా, హజేరా బీ గెలుపొందారని చెప్పారు.
కర్నాటకలో ఆరు వార్డులలో తాము బలపర్చిన అభ్యర్థులు గెలుపొందటంతో మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఆధ్వర్యంలో దారుసలేంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలు చేసుకున్నారు. అక్బర్ మిఠాయి పంచారు. గతేడాది అక్టోబర్ నెలలో మహారాష్ట్రలోని నాందెడ్-వాఘాలా మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ 13 వార్డుల్లో గెలుపొందింది.
కాగా, కర్ణాటకలో సోమవారం వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు బిజెపి గుండెల్లో గుబులు పుట్టించాయి. "మేం ఓడిపోయాం... ఇది మాకు తీవ్ర హెచ్చరికే. దీనిపై కచ్చితంగా ఆత్మశోధన చేసుకుంటాం'' అని పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుసేన్ ఢిల్లీలో విలేకరుల ప్రశ్నలకు జవాబిచ్చారు. అయితే, ఈ ఫలితాలు తమకే కాకుండా అన్ని పార్టీలకూ గుణపాఠమని ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ బెంగళూరులో వ్యాఖ్యానించారు.
మొత్తంమీద బళ్లారి జిల్లాను పదేళ్లుగా ఉక్కు పిడికిలిలో బిగించిన గాలి జనార్దన రెడ్డి కోటలు నేలమట్టం కావడాన్ని ఈ ఎన్నికల విశేషాల్లో గొప్ప విశేషంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. బళ్లారి కార్పొరేషన్లోని 35 స్థానాలకుగాను కాంగ్రెస్ 26 చోట్ల ఘన విజయం సాధించగా, అధికార బీజేపీ బోణీ కొట్టలేకపోయింది. గాలి సన్నిహితుడు బి.శ్రీరాములు స్థాపించిన బీఎస్సార్ కాంగ్రెస్ 6 స్థానాలకు పరిమితం కాగా జేడీ(ఎస్) ఒకటి, స్వతంత్రులు రెండు గెలుపొందారు. చాలాచోట్ల ఏ పార్టీకీ పూర్తి ఆధిక్యం లభించకపోగా 776 మంది స్వతంత్రులు గెలవడం కీలక పరిణామం. యడ్యూరప్ప పార్టీ కేజేపీ ప్రభావం అంతగా లేకున్నా అధికార పార్టీని మాత్రం బాగా దెబ్బతీసింది. యడ్డి సొంత జిల్లా షిమోగాలోని షికారిపుర పట్టణ పంచాయతీ, ఒక పంచాయతీతోపాటు 3 నగరసభలు దక్కాయి.
కర్నాటలో మొత్తం ఉన్న వార్డులు 4,952 కాగా అందులో కాంగ్రెసు 1959, బిజెపి 906, జెడిఎస్ 905, కెజెపి 274, బిఎస్సార్ కాంగ్రెసు 86, స్వతంత్రులు 778 స్థానాల్లో గెలుపొందారు.