జగన్, కెసిఆర్ ఎందుకు కలువలేదో!?: రేవంత్ కౌంటర్

అదే నిజమైతే వేర్వేరుగా ఎందుకు నోటీసులిచ్చారో చెప్పాలన్నారు. తోక పార్టీలలోనే ఐక్యత లేనప్పుడు తమను ఎలా విమర్శిస్తారన్నారు. వేర్వేరుగా అవిశ్వాస నోటీసులు ఇవ్వడం ద్వారా ఆ రెండు పార్టీల బ్లాక్ మెయిల్ రాజకీయాలు, ప్యాకేజీ రాజకీయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అవిశ్వాసంపై తెలుగుదేశం పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఢిల్లీలో కాళ్ల బేరం చేసే పార్టీలు తమ పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సొంత ప్రయోజనాలకు ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నయనడానికి వేర్వేరు నోటీసులే మంచి సాక్ష్యమన్నారు. వారి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు వత్తాసు పలుకలేదనే తమపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే చిత్తశుద్ధి ఉంటే రెండు పార్టీకు కలిసి అవిశ్వానం నోటీసు ఇవ్వాలని సవాల్ విసిరారు. అవిశ్వాసం పేరుతో బ్లాక్ మెయిల్ చేసి బెయిల్ పొందాలని ఒకరు, ప్యాకేజీలు తెచ్చుకోవాలని మరొకరు ప్రయత్నిస్తున్నారన్నారు.
వేర్వేరు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ పెట్టడం ద్వారా ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని కాపాడేందుకు పడుతున్న తాపత్రయం కనిపిస్తోందన్నారు. అంతేకాకుండా తమకు చాలా బలముందని చెబుతున్న తెరాస, వైయస్సార్ కాంగ్రెసులు అవిశ్వాసం కొరకు కావాల్సిన ముప్పై మంది చేత కూడా ఎందుకు సంతకాలు చేయించలేకపోయారని ప్రశ్నించారు. అంటే వారికి బలం లేదా? లేక అవిశ్వాసం పేరుతో బ్లాక్ మెయిల్ రాజకీయాల కోసమా? అని ప్రశ్నించారు.
అవిశ్వాసం పేరుతో ఢిల్లీలో బెయిల్, ప్యాకేజీ బేరాలు కుదుర్చుకునే తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు తాము మద్దతు పలికే ప్రసక్తే లేదన్నారు. కెసిఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తలొగ్గే సమస్యే లేదన్నారు. టిడిపి తీరుతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని తెరాస చెబుతోందని, 2004లో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్నది ఆ పార్టీయే అన్నారు. కాంగ్రెసుకు అమ్ముడుపోయిన చరిత్ర కెసిఆర్ది అని ధ్వజమెత్తారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దిన పత్రిక ఇష్టం వచ్చినట్లుగా రాస్తోందన్నారు. సాక్షి యాజమాన్యం తమ పత్రికను కరపత్రంగా ప్రకటించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ, పేపర్ అని చెప్పి ఇష్టారీతిగా వార్తలు రాయొద్దన్నారు.
కనీసం వార్డు మెంబర్ కూడా కాని షర్మిల అవిశ్వాసంపై మాట్లాడుతుంటే విచిత్రంగా ఉందన్నారు. సాక్షి పత్రికకు తమ కౌగిలింతలు ఎక్కడ కనిపించాయో చెప్పాలన్నారు. తాము హత్యా రాజకీయాలు చేయం. అందుకే అందర్నీ పలుకరిస్తామన్నారు. హత్యారాజకీయాలు చేసే వారికి అందర్నీ పలుకరించే అలవాటు లేదని ఎద్దేవా చేశారు. సాక్షి మిత్రులు అభాండాలు వేసే ముందు ఆలోచించాలన్నారు.












Click it and Unblock the Notifications