బిట్టియా, రాఘవా?: మీడియాను ఆడిపోసుకున్న తండ్రి
భువనేశ్వర్: కేసును సంచలనాత్మకంగా మారుస్తున్నారంటూ అత్యాచారం కేసు నిందితుడు బిట్టి మొహంతి తండ్రి బిబి మొహంతి ఆడిపోసుకుంటున్నారు. ఒడిషా మాజీ డిజిపి అయిన అతగాడు తాను కేరళ పోలీసులకు సహకరిస్తానని అన్నాడు. కేరళ పోలీసులు శుక్రవారం ఒడిషాకు చేరుకుని బిబి మొహంతిని ప్రశ్నించే అవకాశం ఉంది.
కేరళలోని కన్నూరు పోలీసులు బిట్టి మొహంతి చదివిన పాఠశాలను, కళాశాలను కూడా సందర్శించనుంది. తాను కేరళ పోలీసులకు సహకరిస్తానని, విషయం కోర్టులో ఉన్నందున తాను ఎక్కువ మాట్లాడలేనని, ఇటాలియన్ మరైన్స్ మీడియాతో మాట్లాడాలని అనుకోనప్పుడు మీడియా ఎందుకు సంచలనాత్మకం చేస్తుందని ఆయన అన్నారు. సిఎన్ఎన్ - ఐబియన్తో బిబి మొహంతి మాట్లాడాడు.

బిట్టి మొహంతి ఒడిషా మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ బిబి మొహంతి కుమారుడు. బిట్టి మొహంతి 2006 మార్చి 21వ తేదీన రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలో జర్మన్ యాత్రికురాలిపై అత్యాచారం చేశాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2006 ఏప్రిల్ 12వ తేదీన బిట్టీని దోషిగా తేల్చింది. అతనికి ఏడేళ్ల జైలు శిక్ష కూడా పడింది.
అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి చూడడానికి అతను 2006 నవంబర్లో పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. బిట్టీని తప్పించడంలో అతని తండ్రి తన అధికార హోదాను ఉపయోగించాడనే ఆరోపణలు ఉన్నాయి. బిట్టీ తండ్రి బిబి మొహంతిని 2008 జనవరిలో అరెస్టు చేశారు. కొద్ది రోజులు కస్టడీలో ఉన్న తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. అతన్ని సస్పెండ్ చేసి, తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు.
బిట్టి మొహంతి కేసులో తాము కేరళ పోలీసులకు సహకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసిం చెప్పారు. పుట్టపర్తికి వచ్చే కొత్త వ్యక్తులపై, వాహనాలపై తాము ఇక నుంచి నిఘా పెడతామని ఆయన చెప్పారు. బిట్టి పారిపోయినప్పుడు రాజస్థాన్ నుంచి రాష్ట్రానికి చెందిన పోలీసులు ఏ విధమైన అప్రమత్త సందేశం రాలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications