జోగి కోసం జగన్ పార్టీ: శంకరన్నకు దానం ఫోన్
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై గుర్రుగా ఉన్న మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, పి. శంకరరావును అధికార కాంగ్రెసు పార్టీ దువ్వే ప్రయత్నం చేస్తోంది. వారిద్దరికి మంత్రి దానం నాగేందర్ ఫోన్ చేసినట్లు సమాచారం. గ్రీన్ఫీల్డ్ కేసులో చిక్కుకున్న శంకరరావు ముఖ్యమంత్రిపై ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ముఖ్యమంత్రి మీద తెలంగాణ అంశంపై ఆగ్రహంగానే ఉన్నారు. తాను ఢిల్లీలో ఉన్నానని, ఓటింగులో పాల్గొనలేనని కాంగ్రెసు శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు.
ఇదిలావుంటే, కాంగ్రెసు శాసనసభ్యురాలు కొర్ల భారతి అమెరికాలో ఉన్నట్లు సమాచారం. ఆమె అవిశ్వాస తీర్మానంపై ఓటింగులో పాల్గొనే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానంపై తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ముప్పు నుంచి బయటపడినట్లే. ఏడుగురు సభ్యులు గల మజ్లీస్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించబోమని ప్రకటించింది.
అయితే, సాధ్యమైనంత ఎక్కువ బలంతో అవిశ్వాస తీర్మానాన్ని ఓడించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే దూరంగా ఉన్నవారిని సభకు రప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తమ పార్టీ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుకు ఫోన్ చేసి మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోత్కుపల్లి చేసిన ప్రసంగాన్ని ఆయన మెచ్చుకున్నారు.