వైఎస్ ఏ పార్టీ: విజయమ్మకు కన్నా, దానంపై కెటిఆర్

వైయస్ రాజశేఖర రెడ్డి తమ కాంగ్రెసు పార్టీ నాయకుడని ఆయన అన్నారు. తాము ఎన్నికల ప్రణాళికలో పెట్టిన అంశాలను రాజశేఖర రెడ్డి అమలు చేశారని, 2004కు ముందు హామీలు ఇచ్చినప్పుడు వైయస్ సిఎల్పీ నాయకుడిగా, డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారని, సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేశారని ఆయన అన్నారు. సోనియా గాంధీ అంగీకారం తెలిపిన ఎన్నికల ప్రణాళికను ప్రజల్లోకి తీసుకుని వెళ్లామని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రతిపాదించిన తీర్మానానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు ఇవ్వడం వల్ల వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తోందని మంత్రి దానం నాగేందర్ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై తమకు అభిమానం ఉందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అన్నింటినీ అమలు చేస్తున్నామని, కొత్త పథకాలు ప్రవేశపెట్టామని ఆయన అన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ప్రాంతాలకు, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని వైయస్ అన్నారని ఆయన గుర్తు చేశారు.
స్వార్థం కోసం తెరాస అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తెచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే హైదరాబాద్కు వెళ్లాలంటే పాస్పోర్టు తీసుకోవాల్సి ఉంటుందని వైయస్ అన్నారని, అలాంటి పరిస్థితి సృష్టించడానికి ప్రయత్నిస్తున్న పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం వల్ల వైయస్ ఆత్మక్షోభిస్తోందని ఆయన అన్నారు. ఈ రోజును బ్లాక్ డేగా పరిగణిస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ సమయంలో తెరాస సభ్యుడు కెటి రామారావు జోక్యం చేసుకుని - వైయస్ నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెసు శాసనసభ్యులు 42 మంది తెలంగాణ కావాలంటూ సంతకాలు పెట్టారని, అందులో మొదటి సంతకం తనదని దానం నాగేందర్ చెప్పారని, అటువంటి దానం నాగేందర్ ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అధికారం ఉన్నప్పుడు ఒకరకంగా అధికారంలో లేనప్పుడు మరో రకంగా మాట్లాడడం సరి కాదని అన్నారు. తెలంగాణ కావాలని నా భార్య కూడా అంటోందని నాగేందర్ ఓ సందర్భంలో చెప్పారని, అటువంటి నాగేందర్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు దానం నాగేందర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కెటిఆర్ మాటలకు దానం నాగేందర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను విదేశాల నుంచి వచ్చి మాట్లాడడం లేదని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తానని వైయస్ చెప్పారని, ఆ రోజు తెరాసవాళ్లకు చిరునామా లేదని, తెరాస కుటుంబ పార్టీ అని ఆయన అన్నారు. సామాజిక తెలంగాణను బలపరిచే దమ్ము తెరాసకు ఉందా అని ఆయన అడిగారు. ఏ చౌరస్తాలోనైనా మాట్లాడడానికి తాను సిద్దంగా ఉందని, తన కుటుంబం హైదరాబాదులో పుట్టి పెరిగిందని, మొదటి నుంచి రాజకీయాల్లో ఉందని ఆయన చెప్పారు.
టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెసు నుంచి టిడిపిలోకి, టిడిపి నుంచి కాంగ్రెసులోకి వెళ్లిన చరిత్ర దానం నాగేందర్ది అని తెరాస సభ్యుడు హరీష్ రావు అన్నారు. త్యాగాలకు సిద్ధపడిన కుటుంబం తమదని ఆయన అన్నారు. అధికారం కోసం దానం నాగేందర్ వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications