బాబుకు జగన్ పార్టీ సూచన: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విప్
విద్యుత్ కోత, తాగునీటి ఎద్దడిపై టిడిపి, తెలంగాణపై తెరాస, విద్యుత్ కొరత వల్ల పంట నష్టంపై వైయస్సార్ కాంగ్రెసు, జిహెచ్ఎంసితో పాటు రాష్ట్రంలో తాగునీటి కొరతపై మజ్లిస్, విద్యుత్ కొరతపై బిజెపి, విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించాలని సిపిఎం, ఫ్లోరైడ్ సమస్య, నక్కలగండి రిజర్వాయర్ పై, సిపిఐ, తెలంగాణ కోసం బలిదానాలపై నాగం జనార్ధన్ రెడ్డి వాయిదా తీర్మానాలను ఇచ్చారు. వాటిని స్పీకర్ తిరస్కరించారు.
దీంతో సభలో టిడిపి, తెరాస సభ్యులు లేచి తమ ఆందోళన తెలిపారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ సభను గంట పాటు వాయిదా వేశారు. సభ వాయిదా పడిన అనంతరం శోభా నాగి రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, కాపు రామచంద్ర రెడ్డి తదితరులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
ప్రతిపక్షాలు అన్ని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఒక్కటైతే టిడిపి మాత్రం కలిసి రావడం లేదని ఆరోపించారు. చంద్రబాబు అధికార పార్టీకి మద్దతిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటిస్తే మంచిదన్నారు. టిడిపి అవిశ్వాస నోటీసు ఇచ్చినా మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తమ అవిశ్వాస తీర్మానం నోటీసు నిబంధనల ప్రకారమే ఉందని శోభా నాగి రెడ్డి చెప్పారు. కాగా విద్యుత్ కోతలు, సర్ ఛార్జీలను నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. అధికార పార్టీకి టిడిపి కొమ్ముకాస్తోందని ధర్మాన కృష్ణదాసు అన్నారు. ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని కాపు రామచంద్ర రెడ్డి అన్నారు.
అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఆదేశం
అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో అధికార కాంగ్రెసు పార్టీ అందరు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. అనుకోకుండా టిడిపి అవిశ్వాసానికి మద్దతిస్తే ఇబ్బందికర పరిణామాలు ఉండకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతోంది. ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో ఉండాలని బొత్స ఆదేశించారు. ఎమ్మెల్యేలకు కాంగ్రెసు పార్టీ విప్ జారీ చేసింది. ఇవాళ, రేపు అందుబాటులో ఉండాలని సూచించింది.
ప్రజాబలం, సంఖ్యా బలం లేని పార్టీలు అవిశ్వాసం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. సమస్యలపై చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. ఒకరిద్దరు అవిశ్వాస తీర్మానం కోరారని.. దానిపై చర్చకు విపక్ష సభ్యుల్లో చిత్తశుద్ధి లేదన్నారు.