జగన్, వైయస్ దోషులా?: విజయమ్మ, తొక్కేస్తాం: మంత్రి

కొడుకు ఎంత దుర్మార్గుడైనా ఏ తల్లయినా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు. అలాగే విజయమ్మ తన తనయుడును జైలు నుండి బయటకు తీసుకు వచ్చేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారన్నారు. విజయమ్మకు కడుపు కోత నిజమేనని, దానిపై తాము కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు. కానీ, దోచుకున్న వారికి వంత పాడలేమన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాసం పెట్టిందన్నారు.
ఓ వైపు జగన్ పార్టీ, తెరాసలు విలీనం అంటూనే అవిశ్వాస తీర్మానం పెట్టాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు, వైయస్ నిలువు దోపిడీ చేశారన్నారు. సంపాదన ముఖ్యం కాదన్నారు. తాను కూడా బైబిల్ చదువుతానని, బైబిల్ను కించపర్చడం తన ఉద్దేశ్యం కాదన్నారు. దానితో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. వైయస్ రాష్ట్రాన్ని దోపిడీ చేశారని చెప్పడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు పోడియంను చుట్టు ముట్టారు.
బాబు గురించి చెప్పాలంటే చాలా ఉంది
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే చాలా ఉందని వైయస్ విజయమ్మ అన్నారు. బాబును తాను వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. తన చేతిలో ఉండే బైబిల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బాబు గురించి మాట్లాడాలంటే చీకట్లో చిదంబరాన్ని కలిసిన విషయం, ఎఫ్డిఐలలో ఓటింగుకు గైర్హాజరి విషయాలు మాట్లాడాల్సి ఉంటుందన్నారు. కానీ, తాను మాట్లాడదల్చుకోలేదన్నారు.
వైయస్, జగన్ దోషులా?
ఈ రోజు తాను చాలా ఆవేదన చెందుతున్నానని చెప్పారు. తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి, తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దోషులని ఏ కోర్టు చెప్పిందో చెప్పాలన్నారు. సిబిఐ రిపోర్ట్ చదవాల్సిన అవసరమేముందన్నారు. మాకు సభ్యత, సంస్కారం ఉందన్నారు. వారికి అది లేదన్నారు. అవిశ్వాసం ఎందుకు పెట్టామో తాము స్పష్టంగా చెప్పామన్నారు.
డిప్యూటీ వర్సెస్ జగన్ పార్టీ
వైయస్ రాజశేఖర రెడ్డిపై మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోడియాన్ని చుట్టుముట్టింది. దీంతో డిప్యూటీ స్పీకర్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను డిక్టేట్ చేయలేరని డిప్యూటీ స్పీకర్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరు దొంగలో దేశానికి తెలుసు: శైలజానాథ్
స్పీకర్ స్థానాన్ని శ్రీకాంత్ రెడ్డి డిక్టేట్ చేయడం సరికాదని మంత్రి శైలజానాథ్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎందుకు అవిశ్వాసం పెట్టిందో కూడా తెలియదన్నారు. తెరాస అవిశ్వాసానికి మద్దతిస్తుందంటే తెలంగాణకు జగన్ పార్టీ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు. ఎవరు దొంగలో దేశానికంతా తెలుసునని చెప్పారు. అవిశ్వాసం పెట్టే పార్టీల వద్ద విషయం లేదన్నారు. తొక్కి పెట్టేస్తామన్నారు.
ప్రజలు చూస్తున్నారు: డొక్కా
సభలో మన ప్రవర్తనను ప్రజలు చూస్తున్నారనే విషయం తెలుసుకోవాలని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద రావు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు సంయమనంతో వ్యవహరించాలన్నారు. మోత్కుపల్లి కూడా పదే పదే వ్యాఖ్యానించవద్దన్నారు. అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు తొలగిస్తామన్నారు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం సరికాదని మంత్రి దానం నాగేందర్ అన్నారు.












Click it and Unblock the Notifications