ఆ పని చేయలేను:జగన్పై బాబు, చికెన్పై సరదా వ్యాఖ్య
తాము అవిశ్వాసం పెడితే వారు అమ్ముడుపోతారన్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కచ్చితంగా ఎమ్మెల్యేలను కొనాలని, ప్రజాస్వామ్యాన్నీ కొనేయాలని, ఆ పనిని తాను చేయలేనని చెప్పారు. కరెంటు ఇవ్వాల్సిన వేళ సర్కారు చార్జీల షాకులు ఇస్తోందని మండిపడ్డారు. ఇది సర్కారు కాదు.. దోపిడీదారు అని ధ్వజమెత్తారు. విద్యుత్ సర్చార్జీలు మరోసారి పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను మార్టేరు, పెనుగొండ సభల్లో ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
తెరాస అవిశ్వాసం నిర్ణయాన్ని ఆయన తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలను పశువుల మాదిరిగా కొంటున్నారని, అలాంటివాళ్లు అవిశ్వాస తీర్మానం పెడితే టిడిపి సమర్థించాలా? అని ప్రశ్నించారు. చీకటి రాజకీయాలు, సూట్కేసు రాజకీయాలకు టిడిపి దూరమని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజునే అవిశ్వాసం అంటూ ఆ రెండు పార్టీలు చీకటి రాజకీయాలతో ముందుకొచ్చాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చకు ఒకసారి తాము సిద్ధం కాగా, ఆకలి అవుతున్నదంటూ వైయస్ వెళ్లిపోయేవారని గుర్తు చేశారు.
చికెన్ పైన సరదా వ్యాఖ్య
మార్టేరులో బాబు ప్రసంగం పూర్తయిన తర్వాత టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు మార్టేరు చికెన్ పకోడి చాలా బాగుంటుందని, తినమని బాబు వద్దకు తీసుకు వచ్చాడు. ఈ సందర్భంగాలో బాబు సరదాగా మాట్లాడుతూ... తాను ప్రతిరోజు రాగులు, సజ్జలు, జొన్నలతో తయారు చేసిన జావ, కూరగాయలు తింటానని, మాంసాగారం తినడం మానేసి చాలా కాలం అయిందని, తనతో చికెన్ తినిపించాలని మాగంటి బాబు చూస్తున్నారని, తాను తినలేనని, ఆయన భోజన ప్రియుడు, అందరికీ భోజనం పెట్టిస్తాడు, తింటాడని, మార్టేరు చికెన్ పకోటి... మాగంటి పేరు చెప్పి అందరూ తిని, బిల్లు మాత్రం ఆయనకు అప్పగించాలని సరదాగా వ్యాఖ్యానించారు.