అదును చూసి పంచ్: అవిశ్వాసంపై టిడిపి వ్యూహం
సొంతంగా అవిశ్వాస్త్రం పెట్టాలని టిడిపి భావిస్తోంది. సీమాంధ్ర, తెలంగాణల్లో తమ గ్రాఫ్ పెరగడం ప్రారంభమైందని, గత మూడు నెలల్లోనే ప్రజల్లో టిడిపికి ఆదరణ ఆరు శాతం వరకు పెరిగినట్లు తమ సర్వేల్లో వెల్లడైందని వచ్చే ఆరేడు నెలల్లో మరింత పెరిగే అవకాశముందని ఆ పార్టీ భావిస్తోంది. ఆరేడు నెలలు గడిస్తే సొంతంగా గెలవగలిగిన వాతావరణం నెలకొంటుందని అప్పుడు అవిశ్వాసానికి సై అంటామని చెబుతున్నారట.
ఆ సమయం వచ్చిందనుకొన్నప్పుడు అధికార పార్టీ పైన సొంతంగానే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి సర్కారును దించాలన్నది తమ పార్టీ అంతర్గత వ్యూహంగా చెబుతున్నారు. అదే సమయంలో గీత దాటిన వారిపై ఇప్పటికిప్పుడు వేటు వేసి, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలని కూడా ఆ పార్టీ భావించడం లేదట. ఉప ఎన్నికలపై ఆసక్తి లేని ఆ పార్టీ, తెస్తే అసెంబ్లీ ఎన్నికలే తేవాలనే ఉద్దేశ్యంతో ఉందట.
విప్ ధిక్కరించిన వారిపై స్పీకర్కు ఫిర్యాదు చేయనున్నారు. అయితే, చర్యలకు అంతగా వెంట పడకపోవచ్చునని చెబుతున్నారు. కిరణ్ ప్రభుత్వం ఇప్పుడు అవిశ్వాసం ఎదుర్కోవడంతో మరో ఆరు నెలల వరకు ఆ ఊసెత్తే పరిస్థితి లేదు. అప్పటి వరకు పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకు వెళ్లి, సాధారణ ఎన్నికలకు మరో ఆరు నెలలు ఉండగానే కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి ప్రజల్లో క్రెడిట్ కొట్టేయాలని టిడిపి భావిస్తోందంటున్నారు.