ఒక్కటై చిక్కుల్లో పడేశారా?: జగన్ పార్టీలో ఆందోళన!
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానం విషయంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అంతర్మథనం ప్రారంభమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలబడినప్పటికీ ఆ పార్టీ తమను కూడా వదలకపోవడంతో పాటు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను ధీటుగా ఎదుర్కోవడంలో విఫలమవడం, తెరాసను ఏమీ అనలేని పరిస్థితి రావడం వచ్చిందని, అందుకు ఆ పార్టీలో అంతర్మథనం ప్రారంభమైందంటున్నారు.
తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చినప్పటికీ మొదట తెరాస ఇవ్వడంతో స్పీకర్ దానిని ఆమోదించారు. ప్రభుత్వాన్ని, టిడిపిని ఇబ్బందుల్లో పడేయాలన్న ఉద్దేశ్యంతో జగన్ పార్టీ తెరాస అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వక తప్పలేదు. అయితే, తమ పార్టీ మద్దతు తీసుకున్న తెరాస... టిడిపి, కాంగ్రెసుతో పాటు తమ పార్టీని కూడా విమర్శించడం జీర్ణించుకోలేక పోతున్నారట. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని పలుమార్లు ప్రస్తావించడం వారిని అసంతృప్తికి గురి చేసిందంట.
అన్నింటికి మించి.. తెలంగాణ కోసమే పుట్టుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడం ద్వారా సీమాంధ్రలో ప్రభావం చూపుతుందనే ఆందోళన వారిలో ప్రారంభమైందంటున్నారు. ఇన్నాళ్లూ సీమాంధ్రకు చెందిన జగన్ పార్టీ నేతలు... అఖిల పక్షంలో టిడిపి తెలంగానంపై, కాంగ్రెసు నాన్చుడు ధోరణిపై స్థానికంగా బలంగా ప్రచారం చేస్తున్నారట. ఇప్పుడు తెరాసకు మద్దతివ్వడం ద్వారా వారు ఆత్మరక్షణలో పడినట్లయిందని అంటున్నారు.
సమైక్యవాదనకు కట్టుబడుతామని సీమాంధ్ర ప్రజలకు హామీ ఇచ్చి తెరాస ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడం పార్టీ పైన ప్రభావం పడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. దీనిని పూడ్చుకోవడానికి ఏం చేయాలా అనే ఆలోచనలో ఉన్నారట. ప్రభుత్వం కూలుతుందన్నప్పుడు ఇస్తే ఫరవాలేదు కానీ, ప్రధాన ప్రతిపక్షం టిడిపి అవిశ్వాసానికి దూరంగా ఉన్నప్పుడు కిరణ్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని తెలిసి అవిశ్వాసానికి మద్దతివ్వడంపై పార్టీలో చర్చ సాగుతోందంటున్నారు.
టిడిపి, మజ్లిస్ మద్దతు లేకుండా సంఖ్యాబలం ఉండదని తెలిసీ అవిశ్వాసానికి మద్దతు పలికి అబాసుపాలయినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవిశ్వాస చర్చలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్ పార్టీ పైనే ఘాటైన విమర్శలు వచ్చాయి. అవిశ్వాసానికి మద్దతివ్వడం ద్వారా చేజేతులా తిట్టించుకున్నామనే అభిప్రాయంలో జగన్ పార్టీ ఉందంటున్నారు. తెరాస అవిశ్వాసానికి మద్దతు పలకడం ద్వారా సీమాంధ్రలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినా... తెలంగాణలో ఏదైనా మైలేజీ వచ్చిందా అంటే అదీ లేదంటున్నారు.
అవిశ్వాసం ద్వారా తెలంగాణలో తెరాసకు ఆ తర్వాత బిజెపి, సిపిఐలకే మైలేజ్ పోయిందని అభిప్రాయపడుతున్నారు. జగన్ పార్టీని ఇప్పటికీ తెలంగాణ వ్యతిరేక పార్టీగానే గుర్తిస్తున్నారని అంటున్నారు. టిడిపి అవిశ్వాసానికి మద్దతు పలకదని తెలిసినప్పుడు వెనక్కి తగ్గితే బావుండేదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కాంగ్రెసుకు చేయిచ్చి తమ వైపు వచ్చిన మజ్లిస్ పార్టీ కూడా తమతో విబేధిస్తూ బాహాటంగా ప్రచారం చేయడం కూడా పార్టీలో చర్చకు వచ్చిందట.
అసద్ మాట్లాడుతూ... బిజెపితో వైయస్ జగన్ పార్టీ వెళ్లడం బాధాకరం అన్నారు. ఈ విషయం కూడా జగన్ పార్టీలో చర్చకు వచ్చిందట. ఇలాగే తప్పులు చేసుకుంటూ పోతే దగ్గరగా వస్తున్న మజ్లిస్ పార్టీ దూరంగా జరిగే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. ఇప్పటికే మజ్లిస్.. టిడిపితో రహస్య మంతనాలు సాగిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అదే సమయంలో టిడిపి ఇక ముందు బిజెపితో కలిసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో మజ్లిస్ టిడిపి వైపు జారుకున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు.
పోనీ అవిశ్వాసం తీర్మానం చర్చ సందర్భంగా మిగిలిన పక్షాలను ధీటుగా ఎదుర్కొన్న సందర్భం కూడా లేదంటున్నారు. చర్చలో తెరాస, టిడిపి, కాంగ్రెసులు కొన్ని సందర్భాల్లో పై చేయి సాధించాయని కానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం ఒక్క దగ్గరా పైచేయి సాధించిన సందర్భాలు లేవంటున్నారు. గత సమావేశాల్లో మాదిరిగానే జగన్ పార్టీలో అనుభవలేమి స్పష్టంగా కనిపించిందంటున్నారు. విజయమ్మ ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం మినహా ఏమీ చేయలోక పోయారని, మిగిలిన వారి పరిస్థితి అంతే అంటున్నారు.
శోభా నాగి రెడ్డి, కాపు రామచంద్ర రెడ్డి వారు ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నాలు కొంత మేర చేసినప్పటికీ అంతగా ఫలించలేదంటున్నారు. టిడిపి, కాంగ్రెసు, తెరాసలను ఎదుర్కోలేని పరిస్థితుల్లో అసహనానికి గురయి ఆ పార్టీ నేతలు మైకు విసిరి కొట్టారని చెబుతున్నారు. మరో విషయమేమంటే చర్చలో టిడిపి, తెరాసలు ఎక్కడా ఘాటైన విమర్శలు చేసుకున్న సందర్భాలు లేవు. ఆ రెండు పార్టీలు ముందే ఓ ఒప్పందానికి వచ్చి ఉంటాయని చెబుతున్నారు. టిడిపి, టిఆర్ఎస్లు కలిసి కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను లక్ష్యంగా చేసుకోవాలని ముందే ఒప్పందానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.