జగన్ పార్టీలోకి వెళ్తున్నా, తప్పుచేశా: కిరణ్కు జోగి షాక్
శాసన సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా వైయస్ పైన, ఆయన కుటుంబం పైన అన్ని పార్టీలు మూకుమ్మడిగా చేసిన దాడి తన మనసును కలచి వేసిందన్నారు. ఈ దాడిని తట్టుకోలేకే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశానన్నారు. తాను ఈ పాటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్ళవలసి ఉందన్నారు. ఆలస్యంగా వెళ్ళి పొరపాటు చేశానన్నారు. ఇప్పటికైనా వెళ్ళి తప్పును సరిదిద్దుకున్నానన్నారు.
కాంగ్రెస్కు రాష్ట్రంలో నూకలు చెల్లాయనుకుంటున్న తరుణంలో వైయస్ మండుటెండలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. వైయస్ చలువ వల్లే కాంగ్రెస్ నేడు అధికారంలో ఉందన్నారు. పెడన టికెట్ ఇచ్చి తనను ఎమ్మెల్యేను చేసిన వైయస్కు ఎప్పటికీ రుణ పడి ఉంటానని జోగి అన్నారు.
వైయస్ను ఆదర్శంగా తీసుకుని పెడన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. మళ్ళీ పెడన నియోజకవర్గానికి నేనే ఎమ్మెల్యేనవుతానని ఆయన స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ 180 నుంచి 200 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందన్నారు. వైయస్ కుటుంబానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జోగి రమేష్ దిష్టిబొమ్మ దగ్ధం
శాసనసభలో కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు నిరసనగా పెడన పట్టణంలో కాంగ్రెసు కార్యకర్తలు జోగి రమేష్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.