తొలగని విభేదాలు: బాలయ్య విశాఖ పర్యటన ఓ పరీక్ష
విశాఖపట్నం జిల్లా పార్టీ నాయకుల్లో అనైక్యత చోటు చేసుకున్న నేపథ్యంలో బాలకృష్ణ ఈ నెల 23వ తేదీన పాయకరావుపేట, అక్కంపేట, కందిపూడి రాజగోపాలపురం, కుమారపురం గ్రామాల్లో ఎన్టీ రామారావు విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయపథాన నడిపించడానికి ఇప్పటి నుంచే బాలయ్య ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే 23వ తేదీ కార్యక్రమాలు ఖరారయ్యాయి.
విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి, సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి మధ్య ఉన్న విభేదాలను తొలగించడానికి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించినట్లు లేవు. చంద్రబాబు నాయుడి పాదయాత్రకు రోడ్ మ్యాప్ ఖరారు చేయడానికి ఆదివారం జరిగిన సమావేశంలో ఆ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణ మూర్తి హాజరు కాకపోవడంతో చంద్రబాబు పాదయాత్రకు రోడ్ మ్యాప్ ఖరారు చేసే విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. తాను రావడానికి ముందే అయ్యన్న పాత్రుడు సమావేశం ప్రారంభించారని తెలుసుకుని కార్యాలయం వద్దకు వచ్చిన బండారు సత్యనారాయణ వెనక్కి వెళ్లిపోయారు. ఈ స్థితిలో బాలకృష్ణ పర్యటనకు ఏర్పాట్లు చేసే విషయంలో కార్యకర్తలు ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు.
పాయకరావుపేట నియోజకవర్గం బాలకృష్ణకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైంది. మాజీ శానససభ్యుడు చెంగల వెంకట్రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన నేపథ్యంలో అక్కడ నాయకత్వాన్ని గుర్తించాల్సిన స్థితిలో తెలుగుదేశం పార్టీ పడింది. బాలకృష్ణతో సమరసింహా రెడ్డి సినిమాను నిర్మించిన తర్వాత చెంగల వెంకట్రావు రాజకీయాల్లోకి వచ్చారు. నిజానికి, బాలకృష్ణ పాయకరావుపేట కార్యక్రమాన్ని నందమూరి యువజన సంఘం ఏర్పాటు చేస్తోంది.