సోనియాపై నో 'కరుణ': కాంగ్రెస్కు డిఎంకె ఝలక్
న్యూఢిల్లీ/చెన్నై: యూపిఏ-2 ప్రభుత్వానికి డిఎంకె షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుండి డిఎంకె మంగళవారం వైదొలిగింది. శ్రీలంకలోని తమిళ హక్కుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలిగింది. ప్రభుత్వం నుండి వైదొలిగిన నేపథ్యంలో డిఎంకెకు చెందిన ఐదుగురు మంత్రులు ఈ రోజు రాజీనామా చేయనున్నారు.
తమ నిర్ణయానికి ముందు డిఎంకె మంగళవారం ఉదయం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయింది. శ్రీలంకలోని తమిళుల అంశంపై కేంద్రం తమ డిమాండ్లను ఒప్పుకోని పక్షంలో మద్దతు ఉపసంహరించాలని కరుణానిధి సమక్షంలో ఏర్పాటైన ఆ సమావేశంలో అందరూ నిర్ణయించారు.
కాగా, మిత్రపక్షం డిఎంకె నుంచి తీవ్రస్థాయిలో వస్తున్న ఒత్తిడికి తలొగ్గి ఐక్యరాజ్య సమితి వేదికపై శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానానికి మద్దతిచ్చే విషయంలో యూపిఏ సర్కారు ఇరకాటంలో పడిన విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో ఈ నెల 21న జెనీవాలో జరిగే ఐక్య రాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ భేటీలో శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదించే తీర్మానానికి మద్దతు ఇవ్వడంతో పాటు 'తమిళ జాతి నిర్మూలన', 'ఈలం' అంశాలను చేరుస్తూ సవరణ పెట్టాలని డిఎంకె అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు.
అలాగే శ్రీలంకపై నిర్దేశిత వ్యవధిలో పూర్తయ్యేలా అంతర్జాతీయ న్యాయ విచారణ కోరాలని స్పష్టం చేశారు. లేకపోతే యూపిఏలో తాము కొనసాగడం కుదరదని కుండబద్దలు కొట్టారు. "మా డిమాండ్లను అంగీకరిస్తే యూపిఏకు వచ్చిన ముప్పేమీ లేదు. యూపిఏకు మద్దతుపై మాకు అభ్యంతరం లేదని చెబుతూ పరోక్షంగా కఠిన హెచ్చరికలు చేశారు. ఈ విషయంలో చారిత్రక, సాహసోపేత వైఖరి ప్రదర్శించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ప్రధానికి లేఖ రాశారు.
ఈ హెచ్చరికలు, డిమాండ్లతో హడలిపోయిన కేంద్రం ఏకంగా ముగ్గురు మంత్రులను హుటాహుటిన చెన్నై పంపింది. కరుణకు సన్నిహితులైన చిదంబరం, ఏకే ఆంటోనీలతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్ సోమవారం సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:00 గంటల దాకా ఆయనతో మంతనాలాడారు. కరుణ లేఖపైనే ప్రధానంగా చర్చించామని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.
చర్చల సారాంశాన్ని ప్రధాని, సోనియాలకు వివరిస్తామన్నారు. కరుణ తాజా విజ్ఞప్తుల్ని, సూచనల్ని కూడా ప్రధానికి వివరిస్తామన్నారు. అయితే, శ్రీలంక విషయంలో తాము గట్టిగా వ్యవహరించి, అక్కడి యుద్ధనేరాల అంశాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రస్తావిస్తే.. కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో భారత సైన్యం అరాచకాలకు పాల్పడుతోందని కొన్ని దేశాలు ప్రత్యారోపణకు దిగే అవకాశం ఉందన్నది సర్కారు ఆందోళన. అలాగే లంకలో చైనా కార్యకలాపాలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని భావిస్తోంది. మరోవైపు మెతకగా వ్యవహరిస్తే డిఎంకె మద్దతు ఉపసంహరణ, సర్కారుకు ముప్పు తప్పవన్న అభిప్రాయం కాంగ్రెసులో వ్యక్తమయింది.