ఇదిగో వేధింపు: వైయస్ జగన్కు దొరికిన 'డిఎంకె' అస్త్రం
ఏప్రిల్ నెలలో బెయిల్ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, తన ఆస్తులపై కేసులు, అరెస్టు ఇదంతా కాంగ్రెసు కుట్రలో భాగమేనని జగన్ పార్టీ మొదటి నుండి ఆరోపిస్తోంది. జగన్ ఎప్పుడైతే పార్టీని వీడారో అప్పటి నుండే అధికార కాంగ్రెసు పార్టీ ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. జగన్ పార్టీ వీడాకే ఆయన ఆస్తులపై సిబిఐ కేసులంటూ అరెస్టు చేసిందంటూన్నారు. కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ఈ తరహా చర్యలకు పూనుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపణలను అధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. సిబిఐ విచారణతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వస్తోంది. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి డిఎంకె రూపంలో మరో ఆయుధం దొరికినట్లుగా అయింది. యూపిఏ ప్రభుత్వానికి డిఎంకె మద్దతు ఉపసంహరించిన తర్వాత రోజే ఆ పార్టీ నేత స్టాలిన్ నివాసం పైన సిబిఐ సోదాలు ప్రారంభించింది. అధికార పార్టీ పాత్ర పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విదేశీ లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేస్తున్నారు. డిఎంకె మద్దతు ఉపసంహరించినందువల్లే స్టాలిన్ పైన కాంగ్రెసు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సోదాలు చేయిస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇవి జగన్ పార్టీకి మరో ఆయుధంగా మారాయనే చెప్పవచ్చు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉన్న వారిపై ఆ పార్టీ కక్ష సాధిస్తుందని జగన్ పార్టీ చెబుతూ వస్తోంది. ఇప్పుడు డిఎంకె పైన కక్షసాధింపు చర్యలకు పూనుకోవడంతో రాష్ట్రంలో దానిని ప్రచారం చేసుకునే వీలు జగన్ పార్టీకి కలిగిందంటున్నారు. ఇది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కలిసి వచ్చే అవకాశమే అని చెబుతున్నారు.