లొంగిపోయిన శ్రీలక్ష్మి, జైలుకు: వీల్చైర్లు, వాకర్లకు ఓకే
అనంతరం కోర్టు ఆమెకు ఈ నెల 25 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై గాంధీ లేదా ఉస్మానియా వైద్యులతో పరీక్షలు జరిపించి 25లోగా రిపోర్ట్ ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించింది. శ్రీలక్ష్మి జైలులో వీల్ చైర్లు, వాకర్లు ఉపయోగించవచ్చునని కోర్టు తెలిపింది.
కాగా, శ్రీలక్ష్మి మధ్యంతర బెయిల్ పిటిషన్ పొడిగింపు నిర్ణయంపై విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) న్యాయస్థానం ఈ నెల 25వ తేదికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. శ్రీలక్ష్మి ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన బయట ఉన్నారు. తన బెయిల్ పిటిషన్ పొడిగించాలని ఆమె కోర్టుకు వెళ్లారు. దీనిపై కోర్టు విచారిస్తోంది. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై నిర్ధారించాలని చంచల్గూడ జైలు సూపరింటెండెంట్కు సోమవారం సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఉస్మానియా, మహాత్మా గాంధీ ఆసుపత్రుల వైద్యులతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై నిర్ధారించి తెలుపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శ్రీలక్ష్మి ఆపరేషన్ కోసం గతేడాది చివర్లో మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చారు. ఆమె మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో బెయిల్ గడువును పొడిగించాలని ఆమె కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిపై నిర్ధారించాలని ఆదేశించింది. అదే సమయంలో ఈ నెల 21న కోర్టులో హాజరు కావాలని శ్రీలక్ష్మిని ఆదేశించింది.
కాగా, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో శ్రీలక్ష్మిని ప్రాసిక్యూషన్ చేసేందుకు కేంద్రం పదిహేను రోజుల క్రితం అనుమతించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధక చట్టం అభియోగాల పైన శ్రీలక్ష్మిని విచారించేందుకు అనుమతిని ఇచ్చింది. ఐపిసి, పిసి యాక్టుల కింద విచారించేందుకు అనుమతి లభించింది. ఓఎంసికి గనుల లీజు కట్టబెట్టడంలో శ్రీలక్ష్మి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలు ఆమెపై నమోదయ్యాయి. శ్రీలక్ష్మిపై ఐపిసి అభియోగాలను సిబిఐ కోర్టు ఇప్పటికే విచారణకు స్వీకరించింది. తన బెయిల్ పిటిషన్ను పొడిగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కేంద్రం ఆమెను విచారణకు అనుమతించింది.