జగన్ కేసులో కీలక మలుపు: కెవిపికి సిబిఐ నోటీసులు
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కెవిపి రామచంద్ర రావు చక్రం తిప్పారనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ యంత్రాంగంలో ఆయన కీలకంగా వ్యవహరించారట. ఈ నేపథ్యంలో జగన్ ఆస్తుల కేసులో కెవిపి రామచంద్ర రావుకు సిబిఐ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ తదితరులు జగన్ ఆస్తుల కేసులో కెవిపిని విచారించాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు.
వైయస్కు కెవిపి ఆత్మబంధువుగా ముద్రపడ్డారు. వైయస్ హయాంలో ప్రభుత్వంలో ఆయనే కీలకం. ఎవరైనా వైయస్ రాజశేఖర రెడ్డిని కలువాలన్నా మొదట కెవిపిని కలవాలనే వాదన ఉంది. అలాంటి కెవిపికి జగన్ కంపెనీలలోకి వచ్చిన పెట్టుబడులపై తెలిసి ఉంటుందని సిబిఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను విచారించేందుకు సిద్ధమైంది. వైయస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన కెవిపి ఆయన మృతి తర్వాత జగన్ బయటకెళ్లి కొత్త కుంపటి పెట్టుకున్నా ఇతను మాత్రం కాంగ్రెసులోనే కొనసాగుతున్నారు.
సహకరిస్తా: కెవిపి
జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు చెప్పారు. కాగా, కెవిపికి పదిహేను రోజుల క్రితమే సిబిఐ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.