సిఎంను టార్గెట్ చేసిన అక్బర్: కిరణ్ రెడ్డి ఘాటు రిప్లై
కాంగ్రెసును ఎదిరిస్తే జైలులో పెడుతున్నారని, తన అరెస్టు ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెసులోనే ఉంటే వైయస్ జగన్ను జైలులో పెట్టేవారా అని ఆయన అడిగారు. తన అరెస్టు, జగన్ను జైలులో పెట్టడం, తెరాస ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ ఓ తీర్మానం చేద్దామని, తెలంగాణకు అనుకూలంగా గానీ వ్యతిరేకంగా గానీ ఆ తీర్మానం ఉండాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. కావాలని తాను ఎవరినీ జైలుకు పంపించలేదని ఆయన అన్నారు. తనకు ప్రాంత, కుల, మత విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఎవరి మీద తనకు కక్ష లేదని చెప్పారు. అక్బరుద్దీన్పై, ఆయన సోదరుడిపై తనకు గౌరవం ఉందని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని, ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని ఆయన అన్నారు. మీ భావాలను తమపై రుద్ద వద్దని ఆయన అక్బరుద్దీన్కు సూచించారు.
అక్బరుద్దీన్ ప్రసంగాన్ని దేశమంతా చూసిందని, రాగద్వేషాలతో, కక్షపూరితంగా ప్రభుత్వం పనిచేయదని ఆయన చెప్పారు. రాజ్యాంగం ప్రకారం, చట్టప్రకారం తాము వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. అదే సమయంలో తమ ప్రభుత్వం ఎవరికీ భయపడి పనిచేయడం లేదని ఆయన అన్నారు. చట్టాన్ని ఎవరైనా తమ చేతుల్లోకి తీసుకుంటే సహించబోమని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో తాము చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోబోమని ఆయన అన్నారు.
తాము ఏకపక్షంగా వ్యవహరించబోమని, తనపై వారికి ఎటువంటి అభిప్రాయం ఉన్నా సరే తాను పట్టించుకోబోనని ఆయన అన్నారు. కక్ష గట్టి తాము వ్యవహరించామనేది సరి కాదని, అక్బరుద్దీన్ వ్యాఖ్యలు తనకు విచారాన్ని కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.
తన ప్రసంగం వీడియోలను ఎవరు పోస్టు చేశారో, దానికి ఎంత ఖర్చు చేశారో తనకు తెలుసునని, రాజకీయంగా కక్ష కట్టి ఆ పనిచేశారని అక్బరుద్దీన్ అన్నారు. కక్ష కట్టకపోతే 12 ఏళ్ల తర్వాత సంగారెడ్డి కేసు ఎందుకు గుర్తుకు వస్తుందని ఆయన అడిగారు.